రంగారెడ్డి, మార్చి 25, (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలోని పలు ప్రభుత్వ భూముల అమ్మకానికి జిల్లా రెవెన్యూ యంత్రాంగం ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నది. భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టిన దృష్ట్యా రాష్ట్ర సర్కార్ పలు ప్రభుత్వ భూముల అమ్మకాలతో నిధులు సమకూర్చేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో దాదాపు రూ.1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను వేలం వేసేందుకు జిల్లా రెవెన్యూ అధికారులు ప్రతిపాదించారు. వేలం పాటలో కొనుగోలు చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్, గండిపేట, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి మండలాల్లోని పలు ప్రభుత్వ భూములను వేలం ద్వారా విక్రయించేందుకు అధికారులు గుర్తించారు. జిల్లావ్యాప్తంగా 200 ఎకరాల వరకు ప్రభుత్వ భూములను సంబంధిత నాలుగు మండలాల్లో గుర్తించారు. జిల్లా రెవెన్యూ యంత్రాంగం గుర్తించిన ప్రభుత్వ భూముల వివరాలను ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వానికి కలెక్టర్ అందజేయనున్నారు.
అత్యధికంగా గండిపేట మండలంలోనే ప్రభుత్వ భూములను అమ్మేందుకు గుర్తించి ప్రతిపాదించారు. జిల్లాలోని గండిపేట మండలంలోని మంచిరేవుల, కోకాపేట్, మణికొండ, పీరంచెరువు, పుప్పాలగూడ ప్రాంతాల్లోని 125 ఎకరాలు, అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని ఇంజాపూర్, కోహెడ, పసుమాముల ప్రాంతాల్లోని 64 ఎకరాలు, శేరిలింగంపల్లి మండలంలోని నల్లగండ్ల, గోపన్పల్లి, చందానగర్, హఫీజ్పేట్, మదీనగూడ ప్రాంతాల్లో 5 ఎకరాలు, రాజేంద్రనగర్ మండలంలోని మైలార్దేవ్పల్లి, బుద్వేల్ ప్రాంతాల్లోని 2 ఎకరాల ప్రభుత్వ భూములను వేలం నిర్వహించి అమ్మేందుకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం ప్రతిపాదనలను సిద్ధం చేసింది. మరోవైపు ప్రతిపాదించిన ప్రభుత్వ భూముల్లో ఎన్ని ఎకరాలను అమ్మనున్నారనేది పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. అయితే గతేడాది కూడా జిల్లాలోని పలు మండలాల్లోని 150 ఎకరాల వరకు విక్రయించడంతో ప్రభుత్వానికి రూ.1500 కోట్ల ఆదాయం సమకూరింది.
ఆర్డీవోలు, సర్వే అధికారులతో సమావేశం
జిల్లాలోని పలు ప్రభుత్వ భూముల అమ్మకాలకు సంబంధించి కలెక్టర్ అమయ్కుమార్ గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ ఆర్డీవోలతో సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఎలాంటి వివాదాల్లేని ప్రభుత్వ భూముల వివరాలను ఆర్డీవోల నుంచి సేకరించారు.