డెహ్రాడూన్, మే 27: యోగా గురువు బాబా రాందేవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్టు చేయాలంటున్నవారిని ఉద్దేశించి.. వాళ్ల అయ్య కూడా తనను అరెస్టు చేయలేడని అన్నారు. కరోనా చికిత్స కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న మార్గదర్శకాలు, వ్యాక్సిన్లపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న రాందేవ్పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని, అతడిని అరెస్టు చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రధాని మోదీకి లేఖ రాసింది. దీనిపై స్పందించిన రాందేవ్.. వాళ్ల అయ్య కూడా (ఐఎంఏకు చెందినవాళ్లను ఉద్దేశించి) తనను అరెస్టు చేయలేడని పేర్కొన్నారు. ఐఎంఏ అనవసరంగా గొడవ సృష్టిస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నామని, అయినా పనికట్టుకొని అల్లోపతి వైద్యంపై, డాక్టర్లపై రాందేవ్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.