న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కేసు నుంచి సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే శుక్రవారం తప్పుకున్నారు. నిందలు పడటం తనకు ఇష్టం లేదన్నారు. దేశంలో ఆక్సిజన్, టీకాలు, మందుల కొరతకు సంబంధించిన కేసు విచారణను సుప్రీంకోర్టు గురువారం స్వయంగా స్వీకరించింది. ఆక్సిజన్ సరఫరా, టీకాలు, మందుల కొరతను అధిగమిచేందుకు సమగ్ర జాతీయ విధానాన్ని ప్రకటించాలని కేంద్రాన్ని కోరింది. ఈ కేసులపై విచారణ జరుపుతున్నఆరు హైకోర్టుల వ్యాఖ్యలు, ఆదేశాలు గందరగోళానికి దారితీస్తున్నాయని పేర్కొంది. ఈ కేసు విచారణలో సుప్రీంకోర్టుకు సహకరించేందుకు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేను అమికస్ క్యూరీగా శుక్రవారం పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డేతో కూడిన ధర్మాసనం నియమించింది.
అయితే కొందరు సీనియర్ న్యాయవాదులు సాల్వే నియామకంపై విమర్శలు చేశారు. ఆయన జస్టిస్ బోబ్డేకు తెలిసిన వ్యక్తి కావడమే దీనికి కారణమని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తనపై కొందరు సీనియర్ న్యాయవాదులు చేసిన విమర్శలు బాధ కలిగించాలని న్యాయవాది హరీష్ సాల్వే శుక్రవారం కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఆయన చెప్పగా కోర్టు అందుకు అనుమతించింది.
మరోవైపు గురువారం నాటి తమ తీర్పును కొందరు న్యాయవాదులు తప్పుగా అర్థం చేసుకున్నారని సుప్రీంకోర్టు తెలిపింది. దేశంలో కరోనా నిర్వాహణకు సంబంధించిన కేసులను హైకోర్టులు విచారించడాన్ని తాము నిలిపివేయలేదని పేర్కొంది.