వన్యప్రాణులకు తప్పనున్న ప్రమాదాల ముప్పు
అనంతగిరి అటవి చుట్టూ కంచె ఏర్పాటు
2.20 ఎకరాల్లో యాదాద్రి ప్లాంటేషన్
217 ఎకరాల్లో పర్యాటక కేంద్రం
123 ఎకరాల్లో టీబీ దవాఖాన
40 ఎకరాల్లో అనంతపద్మనాభ స్వామి ఆలయం
నిర్మాణానికి రూ.5కోట్ల నిధులు మంజూరు
సాసర్ ప్లేట్లతో తాగు నీటి సదుపాయం
వికారాబాద్, మార్చి 24: తెలంగాణ ఊటీగా అనంతగిరి కొండలు పేరుగాంచాయి. ఈ కొండల్లో వందల సంఖ్యలో వన్యప్రాణులు, పక్షులు జీవిస్తున్నాయి. అనంతగిరి అభివృద్ధికి ఇప్పటికే పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రూ.200 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వికారాబాద్ జిల్లాకే తలమానికంగా ఉన్న అనంతగిరి అడవి చుట్టూ అధికారులు కంచె నిర్మిస్తున్నారు. దీనికి అటవీ శాఖ నుంచి రూ.5 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వీటితో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అనంతగిరి అటవీ ప్రాంతం 3,716 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ అటవీలో 2.20 ఎకరాల్లో యాదాద్రి ప్లాంటేషన్, 217 ఎకరాల్లో పర్యాటక కేంద్రం, 123 ఎకరాల్లో టీబీ దవాఖాన నిర్మించనున్నారు. 40 ఎకరాలు అనంతపద్మనాభ స్వామి దేవాలయానికి కేటాయించారు. అటవీ ప్రాంతం 22 కిలోమీటర్ల మేర విసర్తించి ఉంది. రోడ్డు వారీగా 16 కిలోమీటర్లు ఉంది. ఈ ప్రాంతం చుట్టూ సుమారు 17 కిలోమీటర్ల మేరకు కంచె నిర్మించేందుకు రూ.ఐదు కోట్లతో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దీంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట పడనున్నది. అటవిలోని వన్యప్రాణులకు ఎలాంటి హాని జరుగకుండా ఉంటుంది. అటవీ ప్రాంతంలో పశువులు వెళ్లి మేసే అవకాశం కూడా ఉండదు. కంచె ఏర్పాటుతో అటవీలోని జంతువులు స్వేచ్ఛగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అనంతగిరి అటవిలో వందలకు పైగా పక్షులు, జంతువులు ఉన్నా యి. అందులో నీల్, హైనా, అడవి పందులు, ముళ్లపందులు, జింకలు, నల్లత్రాచు పాము లు, కొండ చిలువలు, నెమళ్లు, రామచిలుకలు, ఇంకా ఎన్నో రకాల పక్షులు, జంతువులు జీవిస్తున్నాయి.
డీర్ రెస్క్యూ పార్కు ఏర్పాటుకు చర్యలు
అనంతగిరి అడవి చుట్టూ కంచె నిర్మాణం పూర్తయితే వీలైనంత త్వరలో వంద ఎకరాల స్థలంలో డీర్ రెస్క్యూ పార్కును ఏర్పాటు చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాదవశాత్తు గాయపడిన జంతువులకు అవసరమైన వైద్య సేవలు అందించి, ఈ రెస్క్యూ పార్కులో వదులుతారు. దీంతో గాయపడిన జంతువులు తొందరగా కోలుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా గాయపడిన జింకలపై అధికారులు పూర్తిస్థాయిలో శ్రద్ధ తీసుకుంటున్నారు.
మూడు చోట్ల అర్బన్ పార్కులు
అనంతగిరితో పాటు జిల్లాలోని జాఫర్పల్లి, కోట్పల్లి గ్రామాల్లో అర్బన్ పార్కులు ఏర్పాటు చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అర్బన్ పార్కుల్లో మొక్కలు నాటడం, చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాట్లు, నీటి వసతి ఉన్న చోట బోటింగ్, యోగా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. అర్బన్ పార్కులకు వచ్చే పర్యాటకులకు కనువిందుతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. యోగా, మెడిటేషన్ తదితర వసతులు కల్పిస్తున్నారు. ఒక్కో అర్బన్ పార్కు నిర్మాణం కోసం రూ.కోటి చొప్పున ఇవ్వాలని ప్రతిపాదనలు పంపించినట్లు అధికారులు తెలిపారు. నిధులు మంజూరు కాగానే వెంటనే నిర్మాణాలు ప్రారంభించనున్నామని వారు పేర్కొంటున్నారు.
తాగునీటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు
అనంతగిరి అటవీలోని వన్యప్రాణులు, పక్షులకోసం సాసర్ ప్లేట్లు ఏర్పాటుచేసి తాగు నీటి సదుపాయం కల్పిస్తున్నారు. ఇందులో ప్రతి రెండు రోజులకోసారి సాసర్ ప్లేట్లను శుభ్రం చేసి తాగునీరు అందులో నింపుతున్నారు. వేసవి కావడంతో జంతువులు నీటి కోసం అడవి వదిలి బయటకు రాకుండా వాటి దాహార్తిని తీర్చేందుకు ఇప్పటికే ఏర్పాట్లుచేశారు.