హైదరాబాద్: భారత్లో వ్యాక్సీన్ తీసుకోవాలనుకునే వ్యక్తులు తప్పనిసరిగా కోవిన్ యాప్ లేదా వెబ్సైటులో తమ వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. కోవిన్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మొబైల్ ఫోన్కి వచ్చిన ఓటీపీ ద్వారా లాగిన్ కావాలి. అందులో వ్యక్తిపేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్తో పాటు కొన్ని వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాల వివరాలు నమోదు చేసుకోవాలి. దేశంలో ఇప్పటికే కోట్లాది మంది తమ వివరాలను కోవిన్ పోర్టల్లో నమోదు చేసుకున్నారు. ఐతే ఇప్పుడు అందులో నమోదు చేసుకున్న యూజర్ల డేటా భద్రంగానే ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది.
కోవిన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వినియోగదారుల డేటా డార్క్ వెబ్లో అమ్మకానికి ఉన్నట్లు హ్యాకర్స్ గ్రూప్ డార్క్ లీక్ మార్కెట్ పేర్కొంది. భారత్లో కొవిడ్ టీకా వేసుకున్న 150 మిలియన్ల మంది పేరు, మొబైల్ నంబర్, ఆధార్ ఐడీ, జీపీఎస్ వివరాలతో కూడిన సమాచారాన్ని 800 డాలర్లకు అమ్మకానికి ఉంచినట్లు తెలిపింది. కోవిన్ యాప్ ద్వారా టీకా తీసుకున్న వారి డేటా సురక్షితంగానే ఉందా అనే సందేహం కలుగుతోంది. దీనిపై సంబంధిత ప్రభుత్వ వర్గాలు స్పందించాల్సి ఉంది.