తిరువనంతపురం: దేశంలో ఇంధనం ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకే పెరిగిపోతున్నాయి. కరోనా మహమ్మారివల్ల వ్యక్తిగత వాహనాల వినియోగం పెరుగడం కూడా పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు ఒక కారణమైంది. ఇంధన ధరల పెంపునకు కారణం ఏదైనా ఈ పెంపువల్ల ఆటోరిక్షాలు, క్యాబ్ల డ్రైవర్లు మాత్రం ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వారికి మోయలేని భారంగా మారుతున్నాయి.
ఈ నేపథ్యంలో కేరళలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఫ్యూయల్ స్టేషన్ యజమాని ఆటోవాలాల కష్టాలను అర్థం చేసుకున్నారు. అందుకే తన వంతు సాయంగా వారికి మూడు లీటర్ల చొప్పున పెట్రోల్, డీజిల్ను ఉచితంగా అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. కాసర్గోడ్ జిల్లా ఎన్మకాజె గ్రామపంచాయతీ పరిధిలో ఓ ఫ్యూయల్ స్టేషన్ ఉన్నది. ఆ ఫ్యూయల్ స్టేషన్ మేనేజర్ పేరు సిద్ధిక్ మధుమోల్. సిద్ధిక్ సోదరుడు అబ్దుల్లా మధుమోల్ దానికి యజమాని.
ఆయన అబుదాబిలో చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. సోదరుడు అబ్దుల్లాను సంప్రదించి సిద్ధిక్ ఆటోవాలాలకు మూడు లీటర్ల చొప్పున ఉచిత ఇంధనం ఆఫర్ ప్రకటించాడు. సోమవారం ఉదయం 6.30 గంటల నుంచి మంగళవారం సాయంత్రం వరకు రెండు రోజులపాటు ఈ ఆఫర్ అమల్లో ఉన్నది. ఈ రెండు రోజుల వ్యవధిలో మొత్తం 313 మంది ఆటోడ్రైవర్లు ఆఫర్ను వినియోగించుకున్నారు. మొత్తం లక్ష రూపాయల విలువైన ఇంధనాన్ని ఉచితంగా ఇచ్చారు.
అనంతరం ఈ ఆఫర్ గురించి సిద్ధిక్ మాట్లాడుతూ.. సాధారణంగా అయితే తమ బంక్కు రోజుకు 300 మంది కస్టమర్లు కూడా వచ్చేవారు కాదన్నారు. కానీ ఆఫర్ కారణంగా కస్టమర్ల సంఖ్య భారీగా పెరిగిందని చెప్పారు. ఆఫర్ అమల్లో ఉన్న రెండు రోజులు పెట్రోల్ ధర రూ.97.70గా, డీజిల్ ధర రూ.93.11గా ఉన్నదని, మొత్తంగా లక్ష రూపాయల ఫ్యూయల్ ఫ్రీగా ఇచ్చామని చెప్పారు. అయితే, లాక్డౌన్ వేళ ఆటోవాలాలకు సాయపడేందుకే ఆఫర్ ప్రకటించాం తప్ప బిజినెస్ ప్రమోషన్ కోసం కాదన్నారు.
కాగా, పెట్రోల్ పంప్ యాజమాన్యం ఆఫర్ పట్ల ఆటోవాలాలు సంతోషం వ్యక్తం చేశారు. తమ ఇన్నేండ్ల సర్వీసులో ఎవరూ ఇలాంటి ఆఫర్ ప్రకటించలేదని చెప్పారు. ప్రస్తుతం రూ.500 ఫ్యూయల్ నింపుకుంటే కేవలం రూ.1000 మాత్రమే సంపాదించ గలుగుతున్నామని, గతంలో రూ.550 ఫ్యూయల్తో రూ.1500 సంపాదించే వాళ్లమని ఓ ఆటోడ్రైవర్ చెప్పాడు. ఇదిలావుంటే లాక్డౌన్ కారణంగా కొత్త ఆటోలకు ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.6000 నుంచి రూ.9000కు పెరిగిందని మరో ఆటోడ్రైవర్ పేర్కొన్నాడు.