గౌహతి: కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోకి ప్రవేశించే వారు రెండు వ్యాక్సిన్లు తీసుకున్నా సరే కరోనా పరీక్షను తప్పని సరిగా చేయించుకోవాలని తెలిపింది. కరోనా టీకా వేయించుకున్నప్పటికీ పరీక్ష నుంచి ఎలాంటి మినహాయింపు లేదని పేర్కొంది. అస్సాంలో కొన్ని నెలలుగా నమోదైన కరోనా కేసులను పరిశీలిస్తే పాజిటివ్ వచ్చిన వారిలో వ్యాక్సినేషన్ తీసుకున్న వారు ఐదు శాతం మేర ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తికి కారణమవుతున్నారని అస్సాం ప్రభుత్వం అనుమానిస్తున్నది. ఈ నేపథ్యంలో కొత్తగా కరోనా మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ అస్సాంలోకి ప్రవేశించే ముందు కరోనా పరీక్ష తప్పనిసరి అని ఆదివారం స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.