కోల్కతా: దేశంలో గ్యాస్, పెట్రోల్ ధరలు నిరంతరాయంగా పెరుగుతుండటంపై పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు వినూత్న పద్ధతుల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మందిర్తలా బజార్ ఏరియాలో తృణమూల్ కార్యకర్తలు గ్యాస్, పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. నిరసన ప్రదర్శనలో భాగంగా వంట గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ రోడ్డుపై మట్టి పొయ్యిపెట్టి వంటలు చేశారు. పెట్రో ధరల పెంపునకు నిరసనగా బైకులకు నిప్పుపెట్టారు.