కోల్కతా: కేంద్ర ప్రభుత్వం తనకు కేటాయించిన భద్రతను వెనక్కి తీసుకోవాలని పశ్చిమ బెంగాల్కు చెందిన టీఎంసీ నేత ముకుల్ రాయ్ కోరారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు శనివారం ఆయన లేఖ రాశారు. అయితే ముకుల్ రాయ్ అభ్యర్థనపై కేంద్ర హోంశాఖ ఇంకా స్పందించలేదు. పశ్చిమ బెంగాల్లోని అధికార టీఎంసీ సీనియర్ నేత అయిన ముకుల్ రాయ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆయనకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష పదవితో కేంద్ర భద్రత కూడా కల్పించారు.
మరోవైపు బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ప్రయత్నాలు ఫలించలేదు. టీఎంసీ మళ్లీ విజయం సాధించింది. మమతా బెనర్జీ మూడోసారి సీఎం పదవిని చేపట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీలో చేరిన ముకుల్ రాయ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం సీఎం మమతను కలిసిన ఆయన సొంత పార్టీకి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీలో ఉండగా తనకు కేటాయించిన కేంద్ర సెక్యూరిటీ కవర్ను వెనక్కి తీసుకోవాలని లేఖ ద్వారా కోరారు.