కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ హింసాత్మకంగా మారడంపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కాషాయ పార్టీని టార్గెట్ చేసింది. కూచ్బెహర్లో సీఆర్పీఎఫ్ కాల్పుల్లో ఐదుగురు మరణించిన ఘటనను ప్రస్తావిస్తూ ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుట్రలో ఇది భాగమని టీఎంసీ ఆరోపించింది. పోలింగ్ సమయంలో సాధారణ ప్రజలపై కేంద్ర బలగాలు ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందని టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ ప్రశ్నించారు.
ఈ కుట్రలో ప్రధానికి భాగస్వామ్యం లేదని తాము అనుకోవడం లేదన్నారు. ఓటర్లను అణిచివేసేందుకే కాల్పులు జరిపారని దుయ్యబట్టారు. ఈ ఘటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించి తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓటింగ్ ప్రక్రియకు భగ్నం కలిగించేందుకు బీజేపీ గూండాలకు కేంద్ర బలగాలు సహకరిస్తున్నాయని మండిపడ్డారు. కూచ్బెహర్ జిల్లా సీతాల్కుచ్చి అసెంబ్లీ నియోజవర్గంలోని ఓ పోలింగ్ బూత్ వద్ద ఘర్షణకు దిగిన గుంపును చెదరగొట్టేందుకు సీఆర్పీఎఫ్ బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారు. అదే నియోజకవర్గంలో జరిగిన ఇంకో ఘటనలో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఇక కాల్పుల ఘటనకు నిరసనగా కూచ్బెహర్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ర్యాలీ నిర్వహించనున్నారు.