న్యూఢిల్లీ: టీనా దాబి.. అతర్ అమిర్ ఖాన్.. ఇద్దరూ ఐఏఎస్ ఆఫీసర్లు. 2015 బ్యాచ్ టాపర్స్. 2018లో పెళ్లి చేసుకున్నారు. ఆ జంట ఇప్పుడు విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇష్టపూర్వకంగానే ఇద్దరూ గత నవంబర్లో డైవర్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ జంట బ్రేకప్కు జైపూర్లోని ఫ్యామిలీ కోర్టు ఓకే చెప్పినట్లు కూడా తెలుస్తోంది.
2015లో టీనా దాబి యూపీఎస్సీ పరీక్షలో టాప్ ర్యాంక్ కొట్టింది. ఆ ఏడాదే కశ్మీర్కు చెందిన అతర్ అమిర్ ఖాన్ రెండో ర్యాంక్ సాధించారు. శిక్షణ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. రాజస్థాన్ కేడర్కు చెందిన ఇద్దరూ.. జైపూర్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇటీవల డిప్యూటేషన్పై అతర్ ఖాన్ను కశ్మీర్కు పంపారు.
ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో చదువుకున్న టీనా దాబి ఓ దళిత విద్యార్థిని. యూపీఎస్సీ పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించడంతో అప్పట్లో ఆమె పెను సంచలనం క్రియేట్ చేసింది. అనంత్నాగ్కు చెందిన అతర్ ఖాన్ ను 2018 ఏప్రిల్లో ఆమె పెళ్లి చేసుకున్నది. ఆ వెడ్డింగ్ రిషప్షన్కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, అప్పటి స్పీకర్ సుమిత్రా మహాజన్ హాజరయ్యారు. దీంతో ఆ వివాహం అందర్నీ ఆకర్షించింది.
మతాంతర వివాహం చేసుకోవడంతో.. అప్పట్లో ఆ వార్త మీడియాలో గుప్పుమన్నది. మత ఆచారాలకు అతీతంగా తమ పెళ్లి జరిగినట్లు కూడా ఆ జంట ఒప్పుకున్నది. కానీ ఇప్పుడు ఆ ఇద్దరూ విడాకుల తీసుకున్నట్లు తెలుస్తోంది.