న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా దేశంలోని 18 జిల్లాల్లో 48 కేసులు నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) డైరెక్టర్ సుజీత్ సింగ్ శుక్రవారం వెల్లడించారు. అత్యధికంగా మహారాష్ట్రలో 20 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదు కాగా.. తమిళనాడులో 9, మధ్యప్రదేశ్లో 7, కేరళలో 3, గుజరాత్, పంజాబ్లో రెండేసి కేసులు, ఆంధ్రప్రదేవ్, ఒడిశా, జమ్ముకశ్మీర్, రాజస్థాన్, కర్ణాటకల్లో ఒక్కో కేసు నమోదైనట్లు ఆయన చెప్పారు.
ఇక ఆందోళనకర వేరియంట్ అయిన డెల్టా వేరియంట్ కేసులు 50 శాతానికిపైగా ఉన్న 8 రాష్ట్రాలపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. ఇందులో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, వెస్ట్ బెంగాల్ ఉన్నాయి.