హైదరాబాద్, నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం ఉపఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ మరోసారి భారీ మెజారిటీతో జయకేతనం ఎగురవేయనున్నదని స్పష్టమైంది. శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ రాత్రి 7 గంటలవరకు కొనసాగింది. కరోనా భయాన్ని లెక్కచేయకుండా ఓటర్లు భారీసంఖ్యలో ఓటు వేశారు. దాంతో 86.8 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలను గట్టి భద్రత మధ్య నల్లగొండకు తరలించి స్టేట్ వేర్హౌసింగ్ గోదాములో భద్రపర్చారు. వచ్చే నెల 2న ఓట్ల లెక్కింపు జరుగనున్నది. అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా ప్రచారం నిర్వహించిన టీఆర్ఎస్కు ఓటర్లు గంపగుత్తగా ఓట్లు వేసినట్టు పలు స్వతంత్ర సంస్థలు, వ్యక్తులు నిర్వహించిన సర్వేలు చెప్తున్నాయి. సీఎం కేసీఆర్ సారథ్యంలోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు విశ్వసించినట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన కుమారుడు నోముల భగత్ను నిలిపింది. భగత్కు సాగర్ ప్రజలు బ్రహ్మరథం పట్టినట్టు తెలుస్తున్నది.
సాగర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా చిన్న అలజడి కూడా లేకుండా పోలింగ్ కొనసాగింది. పోలింగ్పై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని సీఈవో శశాంక్గోయెల్ తెలిపారు. 2,20,300 మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. కొవిడ్ నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లుచేశారు. ఓటర్లంతా మాస్కులు ధరించి, శానిటైజర్ వినియోగించి పోలింగ్కేంద్రంలోకి అడుగుపెట్టారు. ఓటు వేసేందుకు ప్రతిఓటర్కు ప్రత్యేకంగా ప్లాస్టిక్ చేతితొడుగు (గ్లౌస్) అందజేశారు. దీంతో ఓటర్లంతా నిర్భయంగా పోలింగ్లో పాల్గొన్నట్టు సీఈవో ప్రకటించారు. పోలింగ్ కోసం 4 వేలమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేయడంతో ఎక్కడా చిన్న దుర్ఘటన కూడా చోటుచేసుకోలేదు. ఎండ తీవ్రత కారణంగా మధ్యాహ్నం ఒంటిగంట వరకే 53 శాతం మంది ఓట్లు వేశారు. కొవిడ్ పేషెంట్ల కోసం సాయంత్రం ఆరుగంటల నుంచి ప్రత్యేక సమయం కేటాయించగా మొత్తం 36 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు సీఈవో తెలిపారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా రూ.52.55 లక్షల నగదు, రూ.37 లక్షల విలువైన మద్యం సీజ్ చేశామని చెప్పారు. అంతకుముందు ఆయన పోలింగ్ సరళిని ప్రత్యక్షంగా పరిశీలించారు. నాగార్జునసాగర్ మున్సిపాలిటీ, అనుముల మం డలం కొత్తపల్లి గ్రామాల్లో శనివారం పర్యటించారు. సాగర్ పైలాన్ కాలనీ మోడల్ స్కూల్లోని పోలింగ్ కేంద్రం, హిల్ కాలనీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కొత్తపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ విధానంపై సిబ్బందిని అడిగి తెలుసుకొన్నారు. గోయల్ వెంట అదనపు కలెక్టర్ వీ చంద్రశేఖర్ తదితరులున్నారు.
సాగర్లో శనివారం పోలింగ్ సరళిని పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు టీఆర్ఎస్దే గెలుపు అని నొక్కిచెప్తున్నారు. రాజకీయ నేతలతోపాటు పలు మీడియా, ఎన్నికల సర్వే సంస్థలు శాంపిల్ సర్వేలు చేశాయి. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా పోలింగ్ సరళిని అంచనావేశాయి. వీటన్నింటిలోనూ టీఆర్ఎస్ కు భారీ మెజారిటీ వస్తుందని స్పష్టమైందని సమాచారం. టీఆర్ఎస్ ఏకైక ఎజెండాగా ఉన్న సాగర్ అభివృద్ధికే ప్రజలు జై కొట్టినట్టు చెప్తున్నారు. అన్ని వనరులున్నా ఇన్నాళ్లు సాగర్ అభివృద్ధిపై నిర్లక్ష్యం కొనసాగిందన్న ప్రజల భావన ఓటింగ్ సరళిలో కనిపించినట్టు తెలిసింది. అందుకే తాము 2018లోనే టీఆర్ఎస్కు ఓటు వేశామని, ఇప్పుడు మరో పార్టీ గురించి ఎలా ఆలోచిస్తామన్న వాదన కూడా పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు వచ్చిన వారి నుంచి వినవచ్చినట్టు సమాచారం. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్లో మెజార్టీ భాగం మరో ఆలోచన లేకుండా సంక్షేమ ప్రభుత్వానికే ఓటు వేసినట్టు భావిస్తున్నారు. నెల్లికల్ లిఫ్టు, పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపుతామన్న సీఎం కేసీఆర్ హామీతో గిరిజనులంతా మరో ఆలోచన లేకుండా టీఆర్ఎస్కే ఓటు వేసినట్టు సమాచారం. ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించిన సర్వేలో టీఆర్ఎస్కు 55 శాతం, కాంగ్రెస్కు 33.5 శాతం, బీజేపీకి 7.9 శాతం ఓట్లు పోలైనట్టు తెలిసింది. సీఎం కేసీఆర్కున్న పాపులారిటీ నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడేరోజు మరింత ద్విగిణీకృతం అవుతుందని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.