న్యూఢిల్లీ: మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో లక్షకుపైగా కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మూడు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్లో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయని పేర్కొంది. ఉత్తరప్రదేశ్లో రోజువారీ కరోనా కేసుల నమోదు 19.25 శాతం పెరిగిందని వెల్లడించింది. గత 30 రోజుల్లో యూపీలోని 30 నగరాల్లో కరోనా కేసులు గరిష్ఠ మార్కును దాటాయని తెలిపింది. ఎక్కువ ప్రభావితమైన జిల్లాల్లో లక్నో, కాన్పూర్, వారణాసి, ప్రయోగరాజ్ ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది.
మరోవైపు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ కలిసి ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులతో శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ రెండు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిని సమీక్షించడంతోపాటు, నియంత్రించడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.