బ్రసీలియా: బ్రెజిల్లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. అక్కడ ఒక్కరోజే మూడు వేలకుపైగా కరోనా మరణాలు సంభవించాయి. కరోనా మొదటి దశలో తీవ్రంగా ప్రభావితమైన బ్రెజిల్.. రెండో దశలోనూ భారీగా కొత్త కేసులు, వేలల్లో మరణాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. అక్కడ మంగళవారం ఒక్కరోజే 3,251 మరణాలు సంభవించాయి. దాంతో బ్రెజిల్ ఇప్పటివరకు నమోదైన కరోనా చావుల సంఖ్య 2.99 లక్షలకు చేరువయ్యింది.
బ్రెజిల్ ఆరోగ్యశాఖ ఈ వివరాలను అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు ఏ దేశంలోనూ ఈ స్థాయిలో కరోనా మరణాలు చోటుచేసుకోలేదని బ్రెజిల్ ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తంచేసింది. మంగళవారం నాటి కరోనా మరణాల్లో ఒక్క సావోపా నగరంలోనే 1021 మరణాలు సంభవించాయని తెలిపింది. కాగా, కరోనా మరణాల్లో అమెరికా తర్వాత బ్రెజిల్ రెండో స్థానంలో ఉన్నది. కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తుండటంతో బ్రెజిల్ ఆస్పత్రుల్లో రోగులకు ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు సరిపోవడం లేదు.