వినోద్కుమార్కు అర్చక సంఘం నేతల వినతి
హైదరాబాద్/ సిటీబ్యూరో, ఏప్రిల్1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 3,865 గ్రామీణ ప్రాంత దేవాలయాల్లో అర్చకత్వం చేస్తున్న తమ వేతనాలు పెరిగేలా చొరవ తీసుకోవాలని అర్చక సంఘం నేతలు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్కు విజ్ఞప్తిచేశారు. గురువారం మంత్రుల నివాసప్రాంగణంలో ఆయనతో వారు సమావేశమయ్యారు. దూపదీప నైవేద్య పథకం కింద రూ.2500 ఉన్న వేతనాన్ని రూ.6 వేలకు పెంచారని, దీనిద్వారా దాదాపు 4 వేల మంది అర్చకులు ప్రయోజనం పొందుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనాలు సరిపోవడం లేదని, అర్చకులకు కనీసం వేతనం వర్తింపజేయాలని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆదుకోవాలని కోరారు. సమావేశంలో ధూపదీప నైవేద్య పథకం అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవశర్మ, తెలంగాణ అర్చక ఉద్యోగుల సంఘం కోర్ కమిటీ చైర్మన్ పోతులపాడు రామలింగేశ్వర శర్మ, కోశాధికారి నందనం హరికిషన్శర్మ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సురేశ్కుమార్, రాజేశ్ శర్మ, శాస్ర్తుల నాగరాజుశర్మ పాల్గొన్నారు.