ధూళిమిట్ట, మే7 : భయాన్ని మించిన వైరస్ లేదు. ధైర్యాన్ని మించిన వ్యాక్సిన్ లేదు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇస్తున్న కొవ్యాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలతో పాటు ధైర్యం, బలమైన నమ్మకం ఉంటే కరోనాను జయించినట్టే. కరోనాను జయించిన వారి అనుభవాలు వారి మాటల్లోనే…
బలమే జీవనం, బలహీనతే మరణం అనే వివేకానందుడి మాటలను ఆదర్శంగా తీసుకోవాల్సిన సమయాన్ని కరోనా మన దగ్గరకు తీసుకువచ్చింది. మన ధైర్యమే మన బలంగా భావించి కరోనాను జయించాలి. భయభ్రాంతులకు గురిచేసే వాటిని విషంలా భావించి తిరస్కరించాలి. కరోనా సోకినా కూడా తగు జాగ్రత్తలు తీసుకొని వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలి. కరోనా సోకిందని తెలియగానే గాబరాపడి, ధైర్యాన్ని కోల్పోతే అదే మన ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుందనే విషయాన్ని గ్రహించాలి.
ధైర్యమే గెలిపించింది..
నా పేరు బందారం యాదయ్య. 70 ఏండ్ల వయస్సు నాది. నాకు 20 రోజుల కిందట కరోనా వచ్చిందని పరీక్షల్లో తేలింది. కరోనా వచ్చిందని తెలియగానే ముందు కాస్త ఆందోళన అనిపించింది. ధైర్యంగా ఉంటే ఏం కాదని, భయపడితేనే ఇంకా భయం అయితదకున్న. డాక్టర్లు ఇచ్చిన మందులు, వేడివేడి భోజనం, గుడ్లు, తిప్ప తీగ రసం తాగాను. 15 రోజులు ఇంట్లోను ఉన్నా.. నా భార్యకు కూడా కరోనా రావడంతో ఆమె కూడా నాతో పాటు ధైర్యంగా కరోనాను ఎదుర్కొన్నది.
ఏం భయమనిపించలే ..
నా పేరు బందారం సత్తమ్మ. నా భర్తతోపాటు పరీక్షలు చేయించుకుంటే కరోనా వచ్చిందని తెలిసింది. కరోనాకు భయపడితే నయం కాదని, భయపడొద్దని మా కొడుకులు ధైర్యం చెప్పిర్రు. భయపడకుండా మంచి ఆహారం తీసుకుని కరోనాను ఎదురుకున్న. 14 రోజులు ఇంట్లో నుంచి బయటకు పోలే. నేను, నా భర్త ఇద్దరం కరోనాను గెలిచినం. చాలా సంతోషంగా ఉంది. ఎవ్వలూ భయపడకుర్రి. భయపడితేనే కరోనా ఇంకా ఎక్కువయితది. ఏం కాదు అని డాక్టర్లు చెప్పిన మందులు వేసుకొని ధైర్యంగా వుండుర్రి. కచ్చితంగా అందరూ కరోనాను గెలుస్తరు.
మంచి భోజనం, వ్యాయామం చేశా..
నాకు ఏప్రిల్ 17న కరోనా టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్గా తేలింది. ఆ రోజు నుంచి ఇంట్లోనే ఉన్నా. ప్రతిరోజూ రెండు పూటల గుడ్లు, పాలు తీసుకున్న. వేడి భోజనంతో పాటు ప్రోటీన్ ఫుడ్ తీసుకున్న. పండ్లు ప్రతిరోజు తీసుకున్నాను. ప్రతి రోజూ యోగా, వ్యాయామం చేశా. ధైర్యంగా ఉండి 15 రోజుల్లో కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న. ధైర్యం సడలకుండా ఉండడం ముఖ్యం ప్రధానం. అలా ఉంటే కరోనాను కచ్చితంగా జయించగలుగుతాం.