వీసీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్ధసారథి
మహబూబ్నగర్, ఏప్రిల్24: జడ్చర్ల మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతమైన స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు పక్కాగా చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి వీసీలో కలెక్టర్ ఎస్. వెంకట్రావుతో మాట్లాడారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ రోజున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద మాస్కులను అందుబాటులో ఉంచాలని సూచించారు. ‘నో మాస్క్ నో ఓటు’ అనే పాలసీని అమలు చేయాలని తెలిపారు. అధికారులు అందరూ మాస్క్లను ధరించి తమ ఓటు హక్కులను వినియోగించుకోవాలని తెలిపారు. జోనల్ అధికారులు, ఎస్ఎస్టీ బృందాలకు మెజిస్టీరియల్ పవర్స్, సున్నితమైన పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు, ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు.
పోలింగ్ పూర్తి అయిన తర్వాత వాహనాలను అందుబాటులో ఉంచుకుని బ్యాలెట్ బాక్సులను తరలించాలని సూచించారు. ఈనెల 27న సాయంత్రం 5గంటలకు ప్రచారం ముగిస్తుందని ఆయా పార్టీల నేతలకు తెలియజేయాలని సూచించారు. కౌంటింగ్కు ఉపయోగించే టెబుల్స్, కూర్చీలు, ఇతర సామగ్రిని ముందే డిస్ ఇన్ఫెక్షన్ చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ఎస్. వెంకట్రావు మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా పోలీస్ బందోబస్తుపై ఎస్పీతో కలిసి ముందస్తు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఈ నెల 25నుంచి రెండు రోజుల పాటు ఓటరు చిట్టీలను పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్నందలాల్పవర్, తదితరులు ఉన్నారు.