మా తాత మరణానికి ప్రభుత్వానికి సంబంధం లేదు
మా తాత తూటుకూరి మల్లారెడ్డి మరణానికి, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. మల్లన్నసాగర్ కింద ముంపునకు గురవుతున్న వేములఘాట్లోని మా భూములు, ఇంటికి గతంలోనే పరిహారం అందుకున్నాం. తాతతో కలిపి నాకు ముట్రాజ్పల్లిలో ప్రభుత్వం డబుల్బెడ్రూం ఇల్లు కేటాయించింది. చిన్నమ్మ భాగ్యతో కలిసి తాత మల్లారెడ్డి కొద్దిరోజులుగా పిడిచేడ్లోనే ఉంటున్నాడు. ఆయన మృతిని నమ్మలేకపోతున్నా.
మల్లారెడ్డి మనుమడు తిరుపతిరెడ్డి
సిద్దిపేట, జూన్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ తొగుట: సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్లో శుక్రవారం తెల్లవారుజామున పూర్తిగా కాలినస్థితిలో మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన వేములఘాట్ ప్రజలందరూ ముట్రాజ్పల్లిలో ప్రభుత్వం నిర్మించిన ఆర్అండ్ఆర్ కాలనీలో డబుల్బెడ్రూం ఇండ్లకు వెళ్లిపోయారు. దీంతో అక్కడ పాత ఇండ్ల గోడలు మాత్రమే ఉన్నాయి. శుక్రవారం ఉదయం అందులోని ఒక ఇంట్లోనుంచి పొగలు రావడం గమనించినవారు వెళ్లి చూడగా.. కాలిపోయిన స్థితిలో శరీరభాగాలు కన్పించాయి. మృతుడిని వేములఘాట్కు చెందిన తూటుకూరి మల్లా రెడ్డి(70)గా గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మల్లారెడ్డికి ముగ్గురు కూతుళ్లు. పెద్ద కూతురు రాజవ్వను జప్తిలింగారెడ్డిపల్లికి చెందిన భగవాన్రెడ్డికిచ్చి వివాహం చేసి.. ఇల్లరికం తెచ్చుకున్నాడు. 20 ఏండ్ల క్రితమే భగవాన్రెడ్డి మరణించగా, నాలుగేండ్ల క్రితం రాజవ్వ మృతిచెందింది. వారి ఇద్దరు కూతుళ్లకు పెండ్లిండ్లు కాగా, మనుమడు తిరుపతిరెడ్డి, తాత కలిసి ఉంటున్నారు. మల్లారెడ్డి తనరెండో కూతురు వెంకటవ్వను ఏటిగడ్డ కిష్టాపూర్, మూడో కూతురు భాగ్య మిరుదొడ్డి మండలం మల్లుపల్లికి ఇచ్చాడు. భార్య అమృతమ్మ రెండేండ్ల క్రితం చనిపోయింది.
పూర్తి పరిహారంతో ఆర్అండ్ఆర్ కాలనీకి..
మల్లన్నసాగర్ నిర్మాణంతో వేములఘాట్ ముంపునకు గురికావడంతో ప్రభుత్వం అందరిలాగే మల్లారెడ్డి కుటుంబానికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చి, పునరావాసం కల్పించింది. మల్లారెడ్డికి వేములఘాట్లో 2.14 ఎకరాల వ్యవసాయ భూమి, సొంత ఇల్లు ఉన్నది. వీటికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.7.50 లక్షలు, ముట్రాజ్పల్లి ఆర్అండ్ఆర్ కాలనీలో 848 నంబర్ డబుల్ బెడ్రూం ఇంటిని కేటాయించింది. మైనర్ అయిన మనుమడు తిరుపతిరెడ్డికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఇచ్చే రూ.5 లక్షలు, 250 గజాల ప్లాట్ను అందజేసింది. పరిహారం పూర్తిగా అందుకున్నాకే మల్లారెడ్డి తన మనుమడితో కలిసి గత మే మొదటివారంలోనే ముట్రాజ్పల్లిలో అందజేసిన డబుల్బెడ్రూం ఇంటికి వెళ్లారు.
పరిహారం 3 భాగాలుగా పంపకం
ముంపుకింద తనకు వచ్చిన పరిహారాన్ని మల్లారెడ్డి ఇద్దరు కూతుళ్లకు, మనుమనికి పంచి ఇచ్చినట్టు తెలుస్తున్నది. అయితే, అర్అండ్ఆర్ కాలనీలో తనకు వచ్చిన డబుల్బెడ్రూం ఇంటిని చిన్న కూతురు భాగ్య పేరిట పెట్టాలని మల్లారెడ్డి భావించారు. దీనిని మనుమడు తిరుపతిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి 15 రోజులుగా పిడిచేడ్లో కుమార్తె భాగ్య వద్దే ఉంటున్నాడు. తన బ్యాంక్ ఖాతాకు గతంలో నామినీగా ఉన్న తిరుపతిరెడ్డి పేరును తొలగించి.. చిన్నకూతురు భాగ్య పేరుమీదకు మార్చినట్టు తెలిసింది. ఈ క్రమంలో గురువారం రాత్రి మల్లారెడ్డి వేములఘాట్కు వెళ్తున్నానని కూతురుకు చెప్పి పిడిచేడ్ నుంచి బయలుదేరారు. శుక్రవారం ఉదయం తన పాతఇంట్లోనే మంటల్లో కాలిపోయి మృతదేహంగా కన్పించాడు. గ్రామంలో ఎక్కువశాతం మంది ఇండ్లు ఖాళీచేసి ముట్రాజ్పల్లికి వెళ్లడం, అర్ధరాత్రి సమయం కావడంతో ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మా తాత మరణానికి ప్రభుత్వానికి సంబంధం లేదు
తన తాత తూటుకూరి మల్లారెడ్డి మరణానికి, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన మనుమడు తిరుపతిరెడ్డి తెలిపారు. మల్లన్నసాగర్ కింద ముంపునకు గురవుతున్న వేములఘాట్లోని తమ భూములు, ఇంటికి గతంలోనే పరిహారం అందుకున్నామని చెప్పారు. తాతతో కలిపి తనకు ముట్రాజ్పల్లిలో ప్రభుత్వం డబుల్బెడ్రూం ఇల్లు కేటాయించిందని పేర్కొన్నారు. చిన్నమ్మ భాగ్యతో కలిసి తాత మల్లారెడ్డి కొద్దిరోజులుగా పిడ్చేడ్లోనే ఉంటున్నాడని.. ఆయన మృతిని నమ్మలేకపోతున్నానని వాపోయారు. – మల్లారెడ్డి మనుమడు తిరుపతిరెడ్డి
ప్యాకేజీ, పూర్తి పరిహారం అందించాం
తూటుకూరి మల్లారెడ్డికి ముంపుకింద ప్యాకేజీతోపాటు పరిహారం అందజేశామని సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డి తెలిపారు. మనుమడు తిరుపతిరెడ్డితో కలిసి ముట్రాజ్పల్లిలో డబుల్బెడ్రూం కేటాయించామని చెప్పారు. ఇటీవల భార్య మరణించడం, కుటుంబసభ్యుల మధ్య విభేదాల కారణంగా మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. ముంపు గ్రామాల ప్రజలకు ప్రభుత్వం, అధికారుల అండ ఎప్పుడూ ఉంటుందని, అందరికీ న్యాయబద్ధ్దంగా 100 శాతం పరిహారం, పునరావాసం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
అనంతరెడ్డి, సిద్దిపేట ఆర్డీవో
ఆరోపణలు నిరాధారం
మల్లారెడ్డి మృతిని కొంతమంది రాజకీయం చేసి, లబ్ధిపొందాలని చూడటం దురదృష్టకరమని వేములఘాట్ సర్పంచు సిద్దిపేట బాలయ్య ఆవేదన వ్యక్తంచేశారు. మల్లారెడ్డి భూమి, ఇల్లు తదితర ఆస్తులకు ప్రభుత్వం పరిహారం అందించిందని, ప్యాకేజీ కూడా ఇచ్చిందని తెలిపారు. మనుమడు తిరుపతిరెడ్డితో కలిసి మల్లారెడ్డికి డబుల్ బెడ్డ్రూం ఇంటిని కేటాయించిందని చెప్పారు. కుటుంబ, వ్యక్తిగత సమస్యలతోనే మల్లారెడ్డి మృతి చెంది ఉండవచ్చని అన్నారు.
సిద్దిపేట బాలయ్య, వేములఘాట్ సర్పంచు