చెన్నై : అప్పు చెల్లించలేక ఓ కుటుంబాన్నే హత్య చేసిన ఘటన తమిళనాడులోని ఎరోడ్లో వెలుగు చూసింది. కీజ్వాని గ్రామానికి చెందిన ఆర్ కళ్యాణసుందరం(43), కరుప్పనకౌందేర్(72) అనే వ్యక్తి నుంచి కొన్ని నెలల క్రితం రూ. 15 లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించాలని సుందరంపై కరుప్పనకౌందేర్ ఒత్తిడి చేశాడు. అప్పు చెల్లించేందుకు డబ్బు లేకపోవడంతో కరుప్పనకౌందేర్ కుటుంబాన్నే హతమార్చాలని సుందరం నిర్ణయించుకున్నాడు.
దీనికి తన స్నేహితుడు శబరి(25) సహాయం తీసుకున్నాడు. శబరి హెల్త్ వర్కర్గా అవతారమెత్తి కరుప్పన నివాసానికి జూన్ 26న వెళ్లాడు. టెంపరేచర్ చెక్ చేసి.. కరోనా నివారణకు మందులు ఇస్తున్నానని, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయని చెప్పి కొన్ని మందులను ఇచ్చాడు. కానీ అవి మెడిసిన్స్ కాదు.. విషంతో కూడిన మందులు. కరుప్పన భార్య మల్లిక, కూతురు దీప, పని మనిషి కుప్పల్ ఆ మెడిసిన్స్ను తీసుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మల్లిక చనిపోయింది. దీప, కుప్పల్ మరుసటి రోజు మరణించారు. కరుప్పన పరిస్థితి విషమంగా ఉంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి.. సుందరం, శబరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురి మృతికి వీరిచ్చిన మెడిసిన్సే కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. సుందరం, శబరిని జైలుకు తరలించారు.