న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పోలీస్స్టేషన్లలో మానవహక్కుల ఉల్లంఘన, అణచివేత కొనసాగుతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ( CJI NV Ramana ) ఆందోళన వ్యక్తంచేశారు. నల్సా పేరుతో జాతీయ న్యాయసేవల అథారిటీ రూపొందించిన మొబైల్ యాప్ను సీజేఐ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. అదేవిధంగా విజన్ అడ్ మిషన్ స్టేట్మెంట్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన మానవహక్కుల ఉల్లంఘన, తదితర అంశాలపై మాట్లాడారు.
పోలీస్స్టేషన్లలో మానవహక్కుల ఉల్లంఘన అధికంగా జరుగుతున్నదని, సమాజానికి ఇది శ్రేయస్కరం కాదని సీజేఐ వ్యాఖ్యానించారు. సమాజంలో ఇప్పటికీ కస్టోడియల్ హింస, పోలీసుల దాడులు కొనసాగుతుండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన సంరక్షణ ఉన్నప్పటికీ కస్టోడియల్ హింస తీవ్రం కావడం సరికాదన్నారు. పోలీస్స్టేషన్లలో న్యాయపరమైన ప్రతినిధిత్వం లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా తమకు ఉచిత న్యాయ సేవలు అందుబాటులో ఉన్నాయనే విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. ఉచితంగా న్యాయసేవలను పొందడం అనేది ప్రజలకు రాజ్యంగం కల్పించిన హక్కు అని తెలిపారు. దీనిపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడానికి అవసరమైన చర్యలను చేపట్టాలని సూచించారు. ఈ దిశగా ప్రతి పోలీస్స్టేషన్, జైలు దగ్గర హోర్డింగులను నెలకొల్పాలన్నారు.
ఇందుకోసం జాతీయ న్యాయసేవ అథారిటీ దేశవ్యాప్తంగా ఓ ప్రచార ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని ఎన్వీ రమణ కోరారు. ఏడాదిన్నర కాలంగా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నా జాతీయ న్యాయసేవల అథారిటీ తన సేవలను కొనసాగిస్తుండటం హర్షణీయమని మెచ్చుకున్నారు. గ్రామాలు, మారుమూల ప్రాంతాలకు సైతం తమ ఉచిత న్యాయసేవలను తీసుకెళ్లేలా చర్యలను చేపట్టాలని సూచించారు. పేదలకు న్యాయం దూరం కాకూడదని జాతిపిత మహాత్మాగాంధీ కోరుకునే వారని సీజేఐ గుర్తుచేశారు.
పేదలకు న్యాయసేవలను ఉచితంగా అందజేయడంపై న్యాయవాదులు తమ దృష్టిని కేంద్రీకరించాల్సి ఉందని ఎన్వీ రమణ సూచించారు. ప్రత్యేకించి సీనియర్ అడ్వకేట్లు తమ రోజువారీ కార్యక్రమాల్లో కొంత సమయాన్ని ఉచిత న్యాయసేవల కోసం కేటాయించాలన్నారు. ఉచిత న్యాయసేవలపై ప్రజల్లో అవగాహనను కల్పించే విషయంలో మీడియా పాత్రను కూడా ఎంత మాత్రం విస్మరించడానికి వీల్లేదని చెప్పారు. మీడియా తన వంతు సహకారాన్ని అందజేయాలని సీజేఐ ఎన్వీ రమణ అప్పీల్ చేశారు.