లింగంపేట – జగిత్యాల నుంచి 20 వ్యాగన్లతో కిసాన్ రైలు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): లింగంపేట- జగిత్యాల రైల్వేస్టేషన్ నుంచి దేశ రాజధానికి మామిడి పండ్లతో తొలి కిసాన్ రైలు మంగళవారం బయలుదేరింది. న్యూఢిల్లీలోని ఆదర్శనగర్కు 20 వ్యాగన్ల ద్వారా 476 టన్నుల పండ్లతో కిసాన్ రైలును జగిత్యాల నుంచి ప్రారంభించారు. మామిడి పండ్ల రవాణాదారులకు 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా తెలిపారు. రాష్ట్రంలో జగిత్యాలకు నాణ్యమైన మామిడి పండ్లసాగుతోపాటు ఎగుమతికి మంచి పేరు ఉన్నది.
ఇప్పటివరకు మామిడి సీజన్లో వ్యాపారస్తులు, కార్గో అగ్రిగ్రేటర్లు, రైతులు నాణ్యమైన మామిడి పండ్లను రోడ్డుమార్గంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణాచేసేవారు. దీనికి చాలా సమయం పట్టడంతోపాటు రవాణా ఖర్చులు భారీగా ఉండేవి. కిసాన్ రైలు ద్వారా మామిడి పండ్ల రవాణా చాలా సులభమవుతున్నది.