జూబ్లీహిల్స్,ఏప్రిల్21: రహదారుల వెంబడి చెత్త కనబడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. బుధవారం శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఎన్.రవికిరణ్తో కలిసి యూసుఫ్గూడ సర్కిల్లో మేయర్ తొలిసారి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు మారుతున్న గాలి, నీరు, వాతావరణంతో పాటు కొవిడ్ విజృంభణతో రోజురోజుకూ ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలలో చెత్త నిల్వలతో వ్యాధులు ప్రబలే అవకాశముందని, ఈ అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడూ చెత్త తొలగించాలని సూచించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన వారిని ఉపేక్షించవద్దని, సక్రమంగా విధినిర్వహణలో పాల్గొన్న వారిని గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. ఈ సందర్భంగా 19 వ సర్కిల్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ఎ.రమేశ్ ఇతర అధికారులతో కలిసి యూసుఫ్గూడ సర్కిల్లోని వెంకటగిరి తదితర ప్రాంతాలలో పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు.