తిరువనంతపురం : పలు కేసులకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్ధలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ న్యాయవిచారణకు సూచించడాన్ని బీజేపీ తప్పుపట్టింది. సీఎంకు వ్యతిరేకంగా కేసులు ముందుకొస్తుంటే ఆయన దర్యాప్తును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ కేరళ చీఫ్ కే సురేంద్రన్ ఆరోపించారు.
‘విచారణకు ద్రోహం చేసేలా విజయన్ వ్యవహరిస్తున్నారు..ఆయన అమిన్ (ఉగాండా మాజీ నియంత) కాదు..ఆయన రాజ్యాంగాన్ని మించి వ్యవహరించలేర’ని పేర్కొన్నారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసు సహా పలు కేసుల దర్యాప్తు చేపట్టిన కేంద్ర ఏజెన్సీలపై న్యాయవిచారణకు కేరళ కేబినెట్ సిఫార్సు చేసిన నేపథ్యంలో కాషాయ పార్టీ నేత ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కేసులు నమోదు చేసేందుకు సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సాధారణ ఆమోదాన్ని గత ఏడాది నవంబర్లో కేరళ ప్రభుత్వం ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.