బాసర: కరోనా నియంత్రణకు ప్రభుత్వం రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేస్తున్నది. దీంతో బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో భక్తులకు అమ్మవారి దర్శనాలు నిలిపివేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు దేవాలయంలో భక్తులకు దర్శనాలు, ఆర్జిత సేవలు నిలిపివేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి వెల్లడించారు. అమ్మవారికి నిర్వహించే నిత్య పూజలు, కైంకర్యాలన్నీ దేవస్థాన అర్చకులు ఆంతరంగికంగా నిర్వహిస్తారని చెప్పారు.
కాగా, లాక్డౌన్ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆలయంలో పూజలు చేయలేదని అమ్మవారి గర్భాలయానికి తాళం వేశారని ఓ టీవీ చానల్లో నిరాధారమైన ప్రచారం చేస్తున్నారని, అది పూర్తిగా నిరాధారమైనదని, అబద్ధపు ప్రచారాన్ని తీవ్రంగా కండిస్తున్నామని చెప్పారు. అమ్మవారికి నిత్యం జరిగే అభిషేక అలంకరణ, నైవేద్య నీరాజన, మంత్రపుష్ప సేవలో ఎలాంటి లోపం జరగలేదని స్పష్టం చేశారు.
పది రోజుల పాటు లాక్డౌన్ విధించడంతో రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో దర్శనాలు బంద్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే మే 21 వరకు భద్రాద్రిలో దర్శనాలు బంద్ కానున్నాయి. ఉదయం 10 గంటల వరకే దర్శనాలకు అనుమతి లభించనుంది. స్వామివారి నిత్య కైంకర్యాలను ఏకాంతంగానే నిర్వహించనున్నట్టు దేవస్థానం వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి