ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తూనే ఉన్నది. దేశ వ్యాప్తంగా చూస్తే ఆ రాష్ట్రంలోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఆ రాష్ట్ర రాజధాని ముంబైతో పాటు పలు జిల్లాల్లో కరోనా విస్తృతంగా వ్యాపించింది. అయితే మహారాష్ట్రలోని భండారా జిల్లాలో 15 నెలల తర్వాత కరోనా రహిత జిల్లాగా నిలిచింది. ఆ జిల్లాలో 59,809 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,133 మంది మరణించారు. మొత్తంగా భండారా జిల్లాలో కరోనా సోకిన వారందరూ కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.
గత కొద్ది రోజుల నుంచి ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒక వ్యక్తి కూడా కోలుకుని నిన్న డిశ్చార్జి అయ్యారు. శుక్రవారం రోజు ఆ జిల్లా వ్యాప్తంగా 578 కరోనా పరీక్షలు నిర్వహించగా, అందరికీ నెగిటివ్ ఫలితం వచ్చింది. దీంతో ఆ జిల్లా కరోనా రహిత జిల్లాగా నిలిచింది. ఇక ఇప్పుడు అక్కడ కరోనా రోగులు లేరని వైద్యారోగ్య అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజల సహకారంతో ఇది సాధించగలిగామని జిల్లా కలెక్టర్ సందీప్ కదం తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.