హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): కరోనా అనగానే చాలామందిలో ఓ వారంరోజులు ఉండే జ్వరమని.. ఇంట్లో ఉండి నాలుగైదురోజులు చికిత్స తీసుకుంటే సరిపోతుందనే భావన ఉన్నది. ఇది తప్పుడు భావన అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మొదటి వేవ్ సమయంలో అసిమ్టమాటిక్ వ్యక్తులు, స్వల్ప లక్షణాలు ఉన్న బాధితులు నాలుగైదు రోజులు ఐసొలేషన్లో లేదా క్వారంటైన్లో ఉండి జాగ్రత్తలు పాటిస్తూ చికిత్స తీసుకుంటే కోలుకున్న సంగతి వాస్తవమే. కాస్త ఎక్కువ లక్షణాలు ఉన్నవారు (మోడరేట్), తీవ్ర లక్షణాలు ఉన్నవారు సగటున 7 నుంచి 10 రోజులు దవాఖానలో ఉండి చికిత్స పొందాల్సి వచ్చేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొవిడ్-19లో ఉత్పరివర్తనాలు రావడం, డబుల్ వేరియంట్లు ఇప్పుడు దాడులు చేస్తుండటంతో చికిత్సలోనూ చాలామార్పులు వచ్చాయని వైద్యనిపుణులు చెప్తున్నారు. సెకండ్ వేవ్లో కరోనా బాధితుల్లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొంటున్నారు. డబుల్ వేరియంట్ల ప్రభావంతో వైరస్ కాస్త బలపడినట్టు కనిపిస్తున్నదని, దీంతో చికిత్స కాలం పెరిగిందని వెల్లడిస్తున్నారు. సెకండ్ వేవ్లో కనీసం 15 రోజులు చికిత్స అందించాల్సి వస్తున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. హోంక్వారంటైన్లో ఉండి కోలుకున్నవారికి సైతం కనీసం 15 రోజులపాటు వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత సైతం మరో ఒకటిరెండు వారాలు దగ్గు, ఆయాసం, నీరసం వంటివి ఉంటున్నాయి.