హైదరాబాద్: దేశంలో కరోనా థర్డ్ వేవ్ ( Third wave ) పక్కా అని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియ్ రిసెర్చ్ (CSIR) డెరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సీ మాండే తేల్చిచెప్పారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన మాండే దేశంలో కొవిడ్ తదుపరి వేవ్ (థర్డ్ వేవ్) పక్కా అని చెప్పారు. అయితే, ఆ థర్డ్ వేవ్ ఎలా వస్తుంది..? ఎప్పుడు వస్తుంది..? అనే వివరాలు చెప్పడానికి మాత్రం ఆయన నిరాకరించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్లు వేయించుకోవాలని, మాస్కులు ధరించాలని సూచించారు.
వ్యాక్సిన్లు వేసుకోవడం, మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనా వైరస్ తీవ్రతను చాలావరకు తగ్గించవచ్చని శేఖర్ సీ మాండే తెలిపారు. డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా విస్తరిస్తుందనే మాట నిజమేనని, కానీ దాని గురించి అంతగా బాధపడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. ఇప్పటికే అమెరికా, యూరప్, యూకేల్లో థర్డ్ వేవ్ విస్తరించిందని, మన దేశంలోకి ఎప్పుడు, ఎలా వస్తుందో తెలియదని, కాబట్టి మనం చాలా అప్రమత్తంగా ఉండాలని మాండే సూచించారు.