ముంబై: సెకండ్ వేవ్తో అతలాకుతలం అయిన మహారాష్ట్రకు మళ్లీ గడ్డు రోజులు సమీపిస్తున్నాయి. కోవిడ్ థార్డ్ వేవ్ ఆ రాష్ట్రాన్ని మరో రెండు లేదా నాలుగు వారాల్లో తాకనున్నట్లు ఆ రాష్ట్ర టాస్క్ ఫోర్స్ వార్నింగ్ ఇచ్చింది. కానీ థార్డ్ వేవ్లో చిన్నారులపై పెద్దగా ప్రభావం ఉండదని ఆ టాస్క్ ఫోర్స్ చెప్పింది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ అంచనాలు చేసినట్లు తెలుస్తోంది. సెకండ్ వేవ్ కన్నా రెట్టింపు సంఖ్యలో థార్డ్ వేవ్ పాజిటివ్ కేసులు నమోదు అవుతాయని అంచనా వేస్తున్నారు. సుమారు 8 లక్షల మందికి వైరస్ సోకే ప్రమాదం ఉందన్నారు. దాంట్లో కేవలం 10 శాతం కేసులు పిల్లల్లో నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్రిటన్లోనూ సెకండ్ వేవ్ ముగిసిన నాలుగు వారాలకు థార్డ్ వేవ్ వచ్చిందని, అదే రీతిలో మనకు ప్రమాదం పొంచి ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ శషాంక్ జోషీ తెలిపారు.
మహారాష్ట్రలో ప్రస్తుతం అయిదు దశల్లో అన్లాక్ ప్రక్రియ జరుగుతున్నది. నాగపూర్, పుణెతో పాటు 15 జిల్లాలో ఆంక్షలు సడలించారు. ముంబైతో పాటు థానే, వాసాయి, కళ్యాణ్ ప్రాంతాల్లో ఆంక్షలు మరోలా ఉన్నాయి. మరో 34 జిల్లాల్లో వేర్వేరుగా అన్లాక్ ప్రక్రియ అమలు చేస్తున్నారు.