VarunGandhi on Farmers | వివాదాస్పద కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తున్న రైతులకు అధికార బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మద్దతు పలికారు. ఆందోళన చేస్తున్న రైతులు మన రక్తంలో భాగం.. వారితో ప్రభుత్వం తిరిగి చర్చలు జరుపాలని కోరారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆధ్వర్యంలో ఆదివారం మహా పంచాయత్ జరిగింది.
‘ఈనాడు ముజఫర్నగర్లో నిరసన తెలిపేందుకు లక్షల మంది రైతులు వచ్చారు. వారంతా మన రక్తంలో భాగమే. గౌరవనీయ పద్దతుల్లో వారితో మనం చర్చలు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. వారి బాధను అర్థం చేసుకోవాలి. రైతుల కోణంలో సమస్యను అర్థం చేసుకుని వారితో కలిసి ఏకాభిప్రాయానికి రావాలి’ అని వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. దీంతోపాటు భారీ జన సందోహం గల వీడియోనూ జత చేశారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రైతు సంఘాలు ముజఫర్నగర్లో మహా పంచాయత్ నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. సాగు చట్టాలను రద్దు చేయకుంటే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని ఈ సభలో పాల్గొన్న నేతలు పేర్కొన్న సంగతి తెలిసిందే.
నిరసన తెలుపుతున్న రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చలు జరిపింది. కానీ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న రైతు సంఘాల డిమాండ్కు మాత్రం అంగీకరించలేదు. రైతులు తమ పంటలను అమ్ముకోవడానికి కొత్త చట్టాలు కొత్త అవకాశాలు కల్పిస్తాయని కేంద్రం వాదిస్తోంది. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ), వ్యవసాయ మార్కెట్లను ఎత్తేయడానికే ఈ చట్టాలను కేంద్రం తీసుకొచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.