న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోబోమని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం, రైతులతో చర్చలు జరుపుతామని అనడంలో ఏమైనా అర్థం ఉన్నదా? అని శిరోమణి అకాలీదళ్కు చెందిన హర్సిమ్రత్ కౌర్ బాదల్ విమర్శించారు. రైతులకు మద్దతుగా పార్లమెంట్ ఆవరణలో గురువారం ఆమె నిరసన తెలిపారు. ‘దేశానికి తిండి పెడుతున్న రైతులను చంపవద్దు. నల్ల చట్టాలను వెనక్కి తీసుకోండి’ అన్న ఫ్ల కార్డును ప్రదర్శించారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత 8 నెలలుగా ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో నిరసన చేస్తున్నారని హర్సిమ్రత్ కౌర్ తెలిపారు. నిరసనలో పాల్గొన్న రైతుల్లో 500 మందికిపైగా చనిపోయారని చెప్పారు. అయినప్పటికీ రైతుల పరిస్థితిని ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆమె విమర్శించారు.
తమ సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించేందుకు రైతు ప్రతినిధులను అనుమతించడంలేదని కౌర్ ఆరోపించారు. రైతులతో చర్చలు జరుపుతామంటున్న కేంద్ర వ్యవసాయ మంత్రి, ఆ దిశగా చొరవ చూపడం లేదని ఆమె విమర్శించారు. రైతుల కోసం శిరోమణి అకాలీదళ్ పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.