బెంగళూరు: బీజేపీ అధిష్ఠానం కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్చనున్నదని, యెడియూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో ఆ రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మైని కొత్త ముఖ్యమంత్రిగా నియమించనున్నదని ప్రచారం జోరుగా సాగుతున్నది. ఇదే విషయమై మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించగ.. అవన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేశారు. తనను ముఖ్యమంత్రిగా నియమిస్తున్నట్లు అధిష్ఠానం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదన్నారు.
ఊహగానాలను ఆధారంగా చేసుకుని అడిగే ఇలాంటి ప్రశ్నలకు తాను సమాధానం చెప్పదల్చులేదని బసవరాజ్ బొమ్మై వ్యాఖ్యానించారు. కాగా, అంతకుముందే ఈ ఊహగానాలపై కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప కూడా స్పందించారు. సీఎం మార్పు ప్రచారంపై పార్టీ హైకమాండ్ ఈ సాయంత్రానికి ఓ నిర్ణయానికి వస్తుందన్నారు. ఆ నిర్ణయం ఏమిటో మీకు కూడా తెలుస్తుందని మీడియాను ఉద్దేశించి చెప్పారు.