నందిపేట్ రూరల్, ఏప్రిల్ 2: రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణ అధికారిణి ఆర్.శోభ అన్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని ఎస్సారెస్పీ పరీవాహక ప్రాంతాలైన జీజీ నడ్కుడ, గాదేపల్లి శివారుల్లో ఆమె అటవీశాఖ జిల్లా ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారం పర్యటించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో సందడి చేస్తున్న వన్యప్రాణులను తన కెమెరాలో బంధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గోదావరి తీరంలో పలు రకాల వన్యప్రాణులు సందడి చేయడం గొప్ప విషయమన్నారు. ఈ ప్రాంతంలో కమ్యూనిటీ బేస్డ్ ఏకో టూరిజం అభివృద్ధి చేసేందుకు పరీవాహక గ్రామాల ప్రజలను భాగస్వాములను చేస్తామని వివరించారు. గ్రామస్తులతో పర్యావరణ అభివృద్ధి కేంద్రంగా కమిటీలను నియమించి ఇక్కడ పర్యాటక కేంద్రం అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. వన్యసంపదను తిలకించేందుకు పర్యాటకులు రావాలని, కానీ వాటికి నష్టం కలిగించే విధంగా ప్రవర్తించ రాదని సూచించారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఆమె వెంట సీసీఎఫ్ శర్వరన్, జిల్లా ఫారెస్ట్ అధికారి సునీల్, ఆర్మూర్ ఎఫ్డీవో భవానీ శంకర్, రేంజ్ ఆఫీసర్ గణేశ్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సుధాకర్, ఇతర అటవీశాఖ సిబ్బంది ఉన్నారు.
ఇవీ కూడా చదవండి..
హెలికాప్టర్కు చిక్కుకున్న పారాచూట్.. గాల్లో వేలాడిన వ్యక్తి
కరోనా యాంటీబాడీలతో జన్మించిన తొలి శిశువు
డజను మాస్కులు ఆర్డర్ ఇస్తే పన్నెండే వచ్చాయి.. డబ్బులు వాపస్ ఇవ్వండి!
టాంజానియా అధ్యక్షుడు మృతి.. కోవిడే కారణమా !