హైదరాబాద్: దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య గడప దాటి బయటకు రావాలంటే జనం హడలిపోతున్నారు. అయితే ఈ తీవ్రమైన ఎండలవల్ల శరీరం డీ హైడ్రేషన్కు గురవుతుంది. దీంతో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి రాకూడదంటే మన శరీరాన్ని చల్లబరిచే పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి. మరి ఆ పానీయాలేంటో ఒకసారి చూద్దామా..!
చల్ల: పెరుగులో కావాల్సినన్ని నీళ్లు పోసుకుని గిలకొట్టి చల్ల చేసుకోవాలి. ఈ చల్లలో నిమ్మ ఆకులు వేసి, కొంచెం ఉప్పు, కరివేపాకు చేర్చి తాగితే ఒంట్లో వేడి దెబ్బకు తగ్గిపోతుంది.
జల్జీరా నీళ్లు: నాలుగు చెంచాల ఆమ్చూర్ పొడి, అంతే పరిమాణంలో మెంతి పొడి, అర చెంచా వేయించిన జీలకర్ర పొడి, రెండు చెంచాల నల్ల ఉప్పు, చక్కెర, అర చెంచా మిరియాల పొడి కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చల్లటి నీళ్లలో కలుపుకుని తాగితే డీ హైడ్రేషన్ సమస్య వెంటనే తగ్గిపోతుంది.
కొబ్బరి నీళ్లు: ఎండ తీవ్రత విపరీతంగా ఉన్నప్పుడు ఒక్కోసారి అకస్మాత్తుగా ఒళ్లంతా నిస్సత్తువగా మారుతుంది. నీరసం ఆవహిస్తుంది. ఇలాంటి సందర్భంలో కొబ్బరి నీళ్లు తాగితే తక్షణమే ఉపశమనం లభిస్తుంది.
షర్బత్: వేసవిలో బాడీని డీ హైడ్రేషన్ నుంచి కాపాడుకోవడంలో షర్బత్ బాగా పనిచేస్తుంది. గ్లాసెడు నీళ్లలో సగం నిమ్మకాయ పిండుకుని రెండు టీ స్పూన్ల చక్కెర కలుపుకుని షర్బత్ చేసుకుని తాగొచ్చు.