Corona effect : భారత్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజుకు లక్షల్లో కేసులు వస్తున్నాయి. సోమవారం ఒక్కరోజే 2.73 లక్షల కొత్త కేసులు రాగా.. మంగళవారం 2.94 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే 2 వేలకు పైగా కరోనా మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అమెరికా, బ్రిటన్ సహా ఇతర పొరుగు దేశాలు భారత్ నుంచి రాకపోకలపై నిషేధం విధించాయి. కరోనా సెకండ్ వేవ్ మొదలైన తర్వాత ఇప్పటివరకు భారత్ నుంచి ప్రయాణాలపై ఆంక్షలు విధించిన దేశాలు ఏంటో ఒకసారి చూద్దాం..
భారత్లో సోమవారం ఒక్కరోజే 2.73 లక్షల కేసులు నమోదు కావడంతో అమెరికా అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తి అత్యధికంగా ఉన్న జాబితాలో భారత్ను చేరుస్తూ అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెంటేషన్(సీడీసీ) నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి ప్రయాణాలపై నిషేధం విధించింది. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ భారత్కు వెళ్లవద్దని తమ దేశ పౌరులకు సీడీసీ సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్లో పర్యటించడం వల్ల వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా విభిన్న కరోనా వేరియంట్ల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
భారత్ పర్యటనను బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రద్దు చేసుకున్న కొద్దిగంటల్లోనే రాకపోకలపై కూడా ఆంక్షలు విధించారు. దీంతో ఇప్పటివరకు బ్రిటన్ ప్రయాణ ఆంక్షలు విధించిన దేశాల జాబితాలో 40వ స్థానంలో భారత్ నిలిచింది. బ్రిటిష్, ఐరిష్ పాస్పోర్టులు ఉన్న వారు మినహా.. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులను తమ దేశంలోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. ఏప్రిల్ 23 నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయని తెలిపింది. బ్రిటన్లో 100కు పైగా ఇండియన్ డబుల్ మ్యూటెంట్ వేరియంట్ కేసులు నమోదైన నేపథ్యంలో బ్రిటన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
భారత్లో కొవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై క్వారంటైన్ నిబంధనలను సింగపూర్ కఠినతరం చేసింది. భారత్ నుంచి తమ దేశం వచ్చే ప్రయాణికులు 14 రోజుల క్వారంటైన్ ముగిసిన తర్వాత అదనంగా మరో వారం రోజుల పాటు గృహనిర్బంధంలోనే ఉండాలని సూచించింది. ఈ కొత్త నిబంధన గురువారం నుంచి అమలు కానుంది.
కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యాక భారత్ నుంచి రాకపోకలపై తొలిసారిగా న్యూజిలాండ్ ఆంక్షలు విధించింది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై రెండు వారాలపాటు నిషేధం విధిస్తూ ఆ దేశ ప్రధాని జెసిండా అర్నెర్డ్ ఏప్రిల్ 8న నిర్ణయం తీసుకున్నారు. కరోనాపై పోరులో న్యూజిలాండ్ దాదాపు పై చేయి సాధించింది. 40 వారాలపాటు విదేశాల నుంచి వచ్చే వారు మినహా స్థానికంగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే ఇటీవల విదేశాల నుంచి వచ్చిన 23 మందికి పాజిటివ్ నిర్ధరణ కాగా, అందులో 17 మంది భారత్ నుంచే వచ్చిన వారే ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్ నుంచి ప్రయాణాలపై న్యూజిలాండ్ ఆంక్షలు విధించింది.
భారత్తో పాటు పాకిస్తాన్, ఫిలిప్పిన్స్ నుంచి రాకపోకలను రద్దు చేస్తూ హాంకాంగ్ మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఈ మూడు దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు అత్యధికంగా కరోనా స్ట్రెయిన్ వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఢిల్లీ నుంచి హాంకాంగ్ వెళ్లిన 53 మంది ప్రయాణికులకు కొవిడ్-19 వచ్చినట్లు సమాచారం.
భారత్ నుంచి రెండు వారాల పాటు రాకపోకలను నిషేధిస్తూ పాకిస్థాన్ మంగళవారం నిర్ణయం తీసుకుంది. కొత్తరకం కరోనా వేరియంట్ వ్యాప్తి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ రాకపోకలను నిషేధించింది. రెండు వారాల పాటు రోడ్డు, విమాన మార్గాలపై ఈ నిషేధం ఉంటుందని పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Corona second wave | చిన్నారులకు కరోనా వస్తే కనిపించే లక్షణాలివే..
కరోనా అలర్ట్ : రెమ్డిసివిర్ రామబాణం కాదు
డాక్టర్ ను బలిగొన్న మహమ్మారి : మరణానికి 36 గంటల ముందు..
95 రోజుల్లోనే 13 కోట్ల మందికి కోవిడ్ టీకా
భారత్లో కరోనాతో భర్త మృతి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన చైనాలోని భార్య
కోవీషీల్డ్ వ్యాక్సిన్ ధరలు ప్రకటించిన సీరం సంస్థ