(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ)ః కూలీల కడుపు నింపే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఏ)పై కేంద్రం కక్ష సాధింపునకు దిగింది. 2023-24 బడ్జెట్లో ఈ పథకానికి అత్యంత తక్కువగా రూ. 60 వేల కోట్ల నిధులను విదిల్చింది. గడిచిన ఐదేండ్లలో ఇదే అత్యల్పం. దేశంలోని అర్హులైన వారికి చట్టబద్ధంగా 100 రోజుల పాటు పని కల్పించాలంటే, వచ్చే ఆర్థిక సంవత్సరం కనీసం రూ. 2.72 లక్షల కోట్ల నిధులు అవసరమవుతాయని పీపుల్స్ యాక్షన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ (పీఏఈజీ), ఎన్ఆర్ఈజీఏ సంఘర్ష్ మోర్చా నాయకులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలే దాదాపుగా రూ.25 వేల కోట్ల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇవి పోను వచ్చే సంవత్సరానికి నికరంగా అందుబాటులో ఉండే నిధులు కేవలం రూ.35 వేల కోట్లు మాత్రమే. ఇవి మొదటి క్వార్టర్కే సరిపోవని అంచనా వేస్తున్నారు. అయితే, అవసరమైన నిధుల్లో 22 శాతం నిధులను మాత్రమే కేంద్రం కేటాయించడం గమనార్హం.