మెదక్ జిల్లా రామాయంపేట సీఐ నాగార్జునగౌడ్ గతేడాది తన నలుగురు స్నేహితులతో కలిసి ‘సంకల్ప్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛందను ఏర్పాటు చేశారు. ఒక వైపు విధులు నిర్వహిస్తూనే సేవే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. తన టీంతో చిన్నశంకరంపేట, నిజాంపేట, నార్సింగి, చేగుంట, రామాయంపేట మండలాల్లో కొవిడ్ బారిన పడిన వారికి తన టీం సభ్యులతో సేవలందిస్తున్నారు. అలాగే, ఆయా మండలాల్లో ఆర్థికంగా లేని వారిని గుర్తించి వారికి నిత్యావసరాలు, బియ్యం, ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా పెండ్లిండ్లకు పుస్తె మట్టెలు ఇస్తున్నారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది కొవిడ్ బాధితులకు సాయం చేశారు. ఇప్పటి వరకు 50మంది బాధితుల ఇండ్లకు వెళ్లి, స్వయంగా నిత్యావసరాలు అందజేశారు.
నాలుగు మండలాల బాధితులకు..
నాలుగు మండలాల్లోని కరోనా బాధితులు 300మందికి గుడ్లు, పౌష్టికాహారం, పండ్లు, బిస్కట్లు, వాటర్ పాకెట్లు, వైద్యులు రాసిన చీటీ ప్రకారం మందులు, ఐదుగురికి నిత్యం అన్నం వండి పెడ్తున్నారు. కరోనా బారిన పడ్డ ఆవాస విద్యాలయం చిన్నారులను దత్తత తీసుకుని వారికి ప్రతిరోజు బృందంలోని సభ్యుడు టిఫిన్, అన్నం ఇస్తున్నారు.
మరికొంతమంది సేవామూర్తులు
మరికొంత మంది సేవామూర్తులు ముందుకొచ్చి, రామాయంపేటకే చెందిన పెట్రోల్ బంకు బాలరాజు తనశక్తిమేర పండ్లు, వాటర్ పాకెట్లను, టిఫిన్, నిత్యావసరాలను నిత్యం అందజేస్తున్నారు. స్వేరోస్ సంస్థ ఆధ్వర్యంలో శాంతికుమార్ కరోనా బాధితులకు నిత్యావసరాలు అందజేశారు. రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అదే గ్రామంలో కొవిడ్ బారిన పడ్డ 9కుటుంబాలకు తన స్నేహితుడి జ్ఞాపకార్థం నిత్యావసరాలు అందజేశారు.
నా టీంతోనే సేవలు చేస్తున్నా..
నా ఒక్కడితోనే సేవ కాదు. నాతో పాటు మరో నలుగురితో బృందం ఉంది. వారందరితో కలిసి ఆకలితో బాధపడుతున్న వారికి, కరోనా బాధితులు, నిస్సాహాయులకు మా వంతు కర్తవ్యంగా ఆర్థికంగా ఆదుకుంటున్నాం. ముఖ్యంగా కరోనా బారిన పడ్డ వారింటికి వెళ్లి నిత్యావసరాలు, వారికి కావాలంటే డాక్టర్ రాసిచ్చిన చీటీ ప్రకారం మందులు కూడా మేమే సొంత డబ్బులతో తీసుకొచ్చి ఇస్తున్నాం. కరోనాతో బాధపడుతున్న వారుంటే నా దృష్టికి గానీ, మా టీంకు గానీ తెలిపితే, వారిని ఆదుకుంటాం.