న్యూఢిల్లీ: కరోనా రెండో వేవ్ ముగియక ముందే.. మూడో వేవ్ వస్తోందని, అది పిల్లలపై తీవ్ర ప్రభావం చూపబోతోందన్న వార్తలు తల్లిదండ్రులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. అయితే వాళ్ల ఆందోళనకు తెరదించే ప్రయత్నం చేశారు కొవిడ్ టాస్క్ఫోర్స్ చీఫ్ వీకే పాల్. థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఇండియా టుడే టీవీతో ఆయన మాట్లాడారు. ప్రత్యేకంగాపై పిల్లలపైనే ప్రభావం చూపే వేవ్ ఉంటుందన్నదానిపై స్పష్టత లేదు. ఇప్పటి వరకూ కరోనా అటు పెద్దలు, ఇటు పిల్లలపై ఒకే రకమైన ప్రభావం చూపింది అని వీకే పాల్ తెలిపారు.
కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన సెరోప్రివలెన్స్ డేటా ఇదే స్పష్టం చేస్తోంది. వ్యక్తుల బ్లడ్ సీరంలో ఉండే వ్యాధి కారకాల స్థాయిని తెలిపేదే ఈ సెరోప్రివలెన్స్. ఇది పెద్దలు, పిల్లల్లో ఒకేలా ఉన్నట్లు వీకే పాల్ చెప్పారు. అటు థర్డ్ వేవ్ అనేది ప్రత్యేకంగా పిల్లలపైనే ప్రభావం చూపుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఎయిమ్స్ చీఫ్ రణ్దీప్ గులేరియా కూడా స్పష్టం చేశారు.
మీరు వ్యాక్సిన్ తీసుకుంటే పిల్లలకు రక్షణ
తల్లిదండ్రులు వ్యాక్సిన్లు తీసుకుంటే చాలు దాని వల్ల పిల్లలకు రక్షణ కలుగుతుందని వీకే పాల్ చెబుతున్నారు. ఇంట్లోని పెద్దలు వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల వైరస్ పిల్లల వరకూ రావడం అంత సులువు కాదని ఆయన అన్నారు. అటు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కూడా తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తోంది. ఈ వార్తలకు శాస్త్రీయ ఆధారాలు ఏవీ లేవని ఐఏపీ తేల్చి చెప్పింది. నిపుణుల మాట కూడా ఇలాగే ఉంది. ఒకవేళ పిల్లలకు కరోనా సోకినా చాలా వరకు లక్షణాలు ఉండబోవని, ఇంట్లోనే చికిత్స చేసుకోవచ్చని వాళ్లు చెబుతున్నారు. అయితే వాళ్ల వరకూ వైరస్ రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.