న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా శనివారం నుంచి మూడోదశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల ధరలపై కేంద్రాన్ని నిలదీసింది సుప్రీంకోర్టు. ఒకే వ్యాక్సిన్కు రెండు ధరలు ఎందుకని ప్రశ్నించింది. ఉత్పత్తి అయిన వ్యాక్సిన్లు అన్నింటినీ కేంద్రమే ఎందుకు కొనుగోలు చేయడం లేదు? కేంద్రానికి, రాష్ట్రాలకు రెండు ధరలు ఎందుకు? ఇందులో హేతుబద్ధత ఏంటి అని శుక్రవారం కేంద్రాన్ని ప్రశ్నించింది అత్యున్నత న్యాయస్థానం.
వ్యాక్సిన్ ధరల అంశం అనేది చాలా తీవ్రమైనది. కేంద్రానికి వచ్చిన వ్యాక్సిన్లలో 50 శాతం ఫ్రంట్లైన్ వర్కర్లకు, 45 ఏళ్ల పైబడిన వాళ్లకు ఇస్తామన్నారు. మిగతా 50 శాతం రాష్ట్రాలు వాడుకోవచ్చన్నారు. 59.46 కోట్ల మంది భారతీయులు 45 ఏళ్ల లోపు వాళ్లే. వీళ్లలో చాలా మంది నిరుపేద, అణగారిన వర్గాలే. వాళ్లు వ్యాక్సిన్లకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు అని కేంద్రాన్ని సుప్రీం కోర్టు నిలదీసింది.
18-44 ఏళ్ల వయసు వారికి ప్రభుత్వమే వ్యాక్సినేట్ చేయడం చాలా ముఖ్యమని వ్యాఖ్యానించింది. ఎన్ని వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయో మాకు తెలుసు. మీరు ఉత్పత్తిని పెంచేలా చూడాలి. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచాల్సిందే అని కోర్టు స్పష్టం చేసింది.
రాష్ట్రాలకు వార్నింగ్
ఇక రాష్ట్రాలకు కూడా సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సోషల్ మీడియాలో ఎవరైనా హాస్పిటల్ బెడ్ లేదా ఆక్సిజన్ కోసం అప్పీల్ చేసినప్పుడు వారిని వేధించినట్లు తెలిస్తే దానిని కోర్టు ధిక్కరణ కిందే పరిగణిస్తాం. ఈ సందేశం అన్ని రాష్ట్రాలు, డీజీపీలకు వెళ్లాల్సిందే. ఏ సమాచారాన్ని రాష్ట్రాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేయొద్దు. ప్రస్తుతం మన జాతీయ సంక్షోభంలో ఉన్నాము అని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.