న్యూఢిల్లీ: రాజ్యసభలో ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పెగాసస్ స్పైవేర్పై ప్రకటన చేస్తుండగా టీఎంసీ సభ్యులు ఆయన చేతిలోంచి స్టేట్మెంట్ పత్రాలు లాక్కుని చించేసిన ఘటనపై మరో కేంద్రమంత్రి మీనాక్షీ లేఖీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష పార్టీల సభ్యులు పూర్తిగా దిగజారిపోయారని.. ముఖ్యంగా టీఎంసీ, కాంగ్రెస్ పార్టీల సభ్యులైతే రాజకీయ ప్రత్యర్థులుగా అత్యంత నీచస్థాయికి పడిపోయారని ఆమె విమర్శించారు.
పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించిన తీరు దేశ పరువు, మర్యాదలను మంటగలిపేదిగా ఉన్నదని మీనాక్షీ లేఖీ మండిపడ్డారు. ఇవాళ సభలో ఐటీ మంత్రి ప్రకటన చేస్తుండగా ఓ సభ్యుడు ఆయన చేతిలోంచి పత్రాలను లాక్కుని చించి పారేయడం ఎంతవరకు సబబు..? అని లేఖీ ప్రశ్నించారు.