ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులపై సీబీఐ విచారణ చేపట్టాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు కుమారుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం, విచారణ సంస్థ సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే దాఖలైన పిటిషన్ నుంచి ప్రతివాదులుగా ఉన్న ఏపీ ప్రభుత్వం, డీజీపీ, సీఐడీలను తీసివేసి కేంద్ర ప్రభుత్వం, సీబీఐలను చేర్చేందుకు అనుమతిస్తూ కేసు విచారణను ఆరు వారాలు వాయిదా వేసింది.
ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఈనెల 14న ఏపీ సీఐడీ పోలీసులు రఘురామకృష్ణరాజును అరెస్టు చేశారు. పోలీసులు తనను కొట్టారని మరుసటి రోజు మెజిస్ట్రేట్కు తన కాళ్లు చూపిస్తూ లిఖిత పూర్వకంగా పిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో సీఔడీ అధికారులపై సీబీఐతో విచారణ చేపట్టాలని, తన తండ్రిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించిన అధికారులను శిక్షించాలని భరత్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్పై జస్టిస్ వినీత్ శరణ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.
ప్రస్తుత పిటిషన్లో ప్రతివాదులుగా ఉన్న ఏపీ ప్రభుత్వం, డీజీపీ, సీఐడీలను తీసివేసి.. ఆ స్థానంలో సీబీఐ, కేంద్రాన్ని చేర్చాలని పిటినర్ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ధర్మాసనానికి విన్నవించారు. దీనికి అనుమతించవద్దని ఏపీ ప్రభుత్వ సీనియర్ న్యాయవాది దవే చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రతివాదులుగా కేంద్రాన్ని, సీబీఐని చేర్చుతూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆరు వారాలు వాయిదా వేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు సమయం ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం.. రెండు వారాల్లో దానికి రిప్లై ఇవ్వాలని పిటిషనర్ను ఆదేశించింది.