కేంద్రం నుంచి అందని వ్యాక్సిన్లు
హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): అర్హులందరికీ వ్యాక్సిన్ అనే కేంద్రం నిర్ణయానికి ఆదిలోనే అడ్డంకులు మొదలయ్యాయి. మార్చి 1 నుంచి 18 నుంచి 44 ఏండ్లవారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉండగా, వ్యాక్సిన్ల కొరత కారణంగా టీకా కార్యక్రమమే నిలిచిపోతున్నది. కేంద్రం నుంచి సరిపడా డోసులు రాష్ట్రానికి రాకపోవటంతో రాష్ట్ర వ్యాప్తంగా శని, ఆదివారాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్టు వైద్యారోగ్య శాఖ సంచాలకుడు జీ శ్రీనివాస్ శుక్రవారం ప్రకటించారు. ఇప్పటికే వ్యాక్సిన్లు అందకపోవటం వల్ల తొలి డోసు తీసుకున్న అనేక మంది రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నారు. కొవాగ్జిన్ తొలి డోసు పూర్తిగా కరువైపోగా, కోవిషీల్డ్ మొదటి డోసు తీసుకొని సెకండ్ డోసు కోసం ఎదురు చూస్తున్న వారి పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు పూర్తిగా నిండుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ దవాఖానల్లో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. కేంద్రం నుంచి వ్యాక్సిన్లు వస్తే గాని రాష్ట్రంలో మళ్లీ వ్యాక్సినేషన్ మొదలయ్యే పరిస్థితి లేదని ఆరోగ్యశాఖ అధికారులు చెప్తున్నారు.