ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కీలకంగా మారిన సోషల్ మీడియా
సాంకేతికతను అందిపుచ్చుకొనిపార్టీల ప్రచారం..
ఖమ్మం ఎడ్యుకేషన్, ఏప్రిల్23 : ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తున్నది. పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలుపు కోసం తమ శాయ శక్తులను ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాన్ని ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నారు. ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడం.. కరోనా నానాటికీ విజృంభిస్తుండడంతో అభ్యర్థులు నేరుగా ప్రచారం చేయడానికి వీలు కలగడం లేదు. దీంతో సోషల్ మీడియాను ఆశ్రయించి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇందుకోసం పలు రాజకీయ పార్టీలు సోషల్ మీడియా విభాగానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఈ బృందాలు వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి. ప్రస్తుతం పట్టణాల్లో అధిక శాతం జనాభా స్మార్ట్ఫోన్లను వినియోగించడం.. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండడంతో రాజకీయ పార్టీల ప్రచారానికి సోషల్ మీడియా ఫ్లాట్ఫాం కలిసొచ్చింది.
ప్రత్యేక బృందాల నియామకం…
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో డిజిటల్ ప్రచార హోరును అన్ని పార్టీలు షురూ చేశాయి. ఇప్పటికే ఆయా పార్టీల సోషల్ మీడియా బృందాలు ప్రచారంలో దూకుడును పెంచాయి. ఓటర్లను ఆకట్టుకోవడానికి వినూత్న ప్రయత్నంపై దృష్టిసారించాయి. గెలుపే లక్ష్యంగా ప్రతి ఓటరుకు చేరువ అయ్యేందుకు సోషల్ మీడియానే ప్రధాన ఆయుధంగా మార్చుకున్నారు. ప్రస్తుతం కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్కో డివిజన్ అభ్యర్థి సోషల్ మీడియా కోసం రూ. 50వేల వరకు ఖర్చు చేస్తుంది. ప్రచార చిత్రాలు, వాటికి అనుగుణంగా ఆకట్టుకునే కోటేషన్లు పెడుతున్నారు. డిజైన్ చేసేందుకు డిజైనర్లు పనిచేస్తున్నారు. ప్రచార వీడియోలు తీసేందుకు, వీడియోలకు అనుగుణంగా పాటలను జత చేసి ఫేస్బుక్, గ్రూప్లో పోస్టులు చేసేందుకు ప్రత్యేక టీమ్లు పనిచేస్తున్నాయి. ఫేస్బుక్లో వచ్చే కామెంట్లకు ధన్యవాదాలు తెలుపడం, ఈ టీమ్లు చూసుకుంటాయి. వీటితో పాటు బల్క్ ఎస్ఎంఎస్లను పంపిస్తున్నాయి.
డిజిటల్ ఆయుధం…
రాజకీయ పార్టీలు సోషల్ మీడియా( ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, వాట్సాప్, ట్విటర్)పై ఆధార పడుతున్నాయి. గల్లీ, కాలనీ, డివిజన్ల వారీగా విడివిడిగా గ్రూప్లు ఏర్పాటు చేసి పోస్టులు పెడుతున్నాయి. పోటీ చేస్తున్న డివిజన్ల పరిధిలోని అభ్యర్థులు ఫోన్ నెంబర్లు సేకరించి, వాటిల్లో మహిళలు, ఫురుషులు ఇలా గ్రూప్లు క్రియేట్ చేస్తున్నారు. అభ్యర్థి అనుచరులు మరో వాట్సాప్ గ్రూప్గా ఏర్పడి ప్రచారంలో జరిగే అన్నింటిని ఈ గ్రూప్లో పోస్టు చేస్తుంటారు. వీటిని ఆ డివిజన్ పరిధిలోని ఏర్పాటు చేసిన పలు గ్రూప్ల్లో పోస్టులు చేస్తున్నారు. అలాగే వారి వ్యక్తిగత నెంబర్లకు స్టేటస్లు పెట్టడం, ఫేస్బుక్లో పోస్టులు చేయడం చేస్తున్నారు. ప్రస్తుతం అందరి దగ్గర స్మార్ట్ఫోన్ ఉండడంతో క్షణాల్లో ప్రచారం తాలుకా ఫొటోలు, వీడియోలను అప్లోడ్ చేసి ఓటర్లకు దగ్గరవుతున్నారు. చిన్న పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరి నెట్ వినియోగిస్తూ సామాజిక మాధ్యమాల్లో గడుపుతున్నారు.
ఇవి కూడా చదవండి
ఊరట : యాంటీ వైరల్ డ్రగ్ విరాఫిన్ వాడకానికి డీసీజీఐ ఆమోదం
కోవిడ్ హాస్పిటల్లో కేంద్రమంత్రి.. అధికారులతో మంతనాలు