కోల్కతా: బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అయిన నుస్రత్ జహాన్ ( Nusrat Jahan ) ఈ మధ్యే ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలుసు కదా. అయితే తన బిడ్డకు తండ్రెవరన్న విషయాన్ని మాత్రం ఆమె ఇప్పటి వరకూ చెప్పలేదు. 2019లో వ్యాపారవేత్త నిఖిల్ జైన్ను టర్కీలో పెళ్లి చేసుకున్న ఆమె.. భారతీయ చట్టాల ప్రకారం ఆ పెళ్లి చెల్లదంటూ అతనితో విడిపోయారు. అప్పటికే ఆమె గర్భం దాల్చగా.. గత నెల 26న కోల్కతాలోని ఓ హాస్పిటల్లో ఓ బిడ్డకు జన్మనిచ్చారు. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తాను పాల్గొంటానని చెప్పిన నుస్రత్.. ఎలాంటి ప్రశ్నలనైనా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ధీమాగా చెబుతున్నారు.
ప్రముఖ న్యూస్ చానెల్ ఎన్డీటీవీతో మాట్లాడిన ఆమె.. మరోసారి తన బిడ్డకు తండ్రెవరన్న ప్రశ్నపై స్పష్టంగా సమాధానం ఇవ్వలేదు. తండ్రెవరో ఆ తండ్రికి తెలుసు అని ఆమె చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఆమె నటుడు యష్దాస్ గుప్తాతో కలిసి ఉంటున్నారు. ఆమె డెలివరీ సమయంలో అతడే దగ్గరుండి ఆమె బాగోగులు చూసుకున్నాడు. ప్రస్తుతం తమ కొడుకు ఇహాన్తో కలిసి ఇద్దరం సంతోషంగా ఉన్నట్లు నుస్రత్ చెప్పారున. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని, ఇదో కొత్త ఆరంభమని ఆమె అన్నారు.