24గంటల్లో కేసులు 22,771

Jul 05, 2020 , 00:50:12

  • 6.48 లక్షలు దాటిన వైరస్‌ రోగులు
  • తమిళనాడులో లక్ష దాటిన బాధితులు
  • 18,655కు చేరుకున్న మృతులు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ దేశమంతటా శరవేగంతో వ్యాపిస్తున్నది. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా శుక్రవారం ఉదయం నుంచి శనివారం వరకు 22,771 మందికి పాజిటివ్‌ అని తేలింది. దీంతో దేశవ్యాప్తంగా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 6,48,315కు చేరింది. మహారాష్ట్ర తర్వాత తమిళనాడులో కరోనా సోకిన రోగుల సంఖ్య లక్ష మందిని దాటింది. కాగా, 20 వేలకు పైగా కేసులు నమోదు కావడం వరుసగా రెండో రోజు. గత నెల 1 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4,57,780 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా 442 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 18,655కు చేరుకున్నదని కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. ఇప్పటి వరకు 3,94,226 మంది రోగులు కరోనా నుంచి కోలుకోగా 2,35,433 మంది చికిత్స పొందుతున్నారు. కోలుకున్న రోగులు 60.80 శాతంగా ఉన్నారు. ఈ నెల 3 వరకు దేశవ్యాప్తంగా 95,40,132 మందికి, శుక్రవారం 2,42,382 మందికి కరోనా పరీక్షలు జరిపినట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) తెలిపింది. మొత్తం మరణాల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 8,376 మంది, ఢిల్లీలో 2,921, గుజరాత్‌లో 1904, తమిళనాడులో 1385 మంది మృత్యువాత పడ్డారు. కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 1,92,990 మంది, తమిళనాడులో 1,02,721, ఢిల్లీలో 94,695, గుజరాత్‌లో 34,600, ఉత్తరప్రదేశ్‌లో 25,797, పశ్చిమ బెంగాల్‌లో 20,488 కేసులు రికార్డయ్యాయి.

నితీశ్‌ కు కరోనా పరీక్షలు

పట్నా: బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, ఉపముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ స్వాబ్‌ నమూనాలను శనివారం కరోనా పరీక్షల కోసం పంపించారు. బీహార్‌ శాసనమండలి తాత్కాలిక చైర్మన్‌ అవదేశ్‌ నారాయణ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వీరితో పాటు ముఖ్యమంత్రి కార్యాలయంలోని 15 మంది సిబ్బంది నమూనాలను కూడా పంపించారు. ఈ నెల 1న ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం సమయంలో అవదేశ్‌ నారాయణ్‌, నితీశ్‌ కుమార్‌ ఒకే వేదికను పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే వారి నమూనాలను పరీక్షల కోసం పంపించారు. 

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD