న్యూఢిల్లీ, మే 25: కరోనా బారినపడి చనిపోయిన తల్లిదండ్రులకు తలకొరివి పెట్టడానికి కడుపునపుట్టిన వాళ్లే ముఖం చాటేస్తున్న సమయమిది. దీనికి కారణం… కరోనా మృతుల నుంచి ఆ వైరస్ తమకు ఎక్కడ సోకుతుందోనన్న భయం! అయితే కరోనాతో మరణించిన వ్యక్తుల మృతదేహాల నుంచి ఆ వైరస్ వ్యాపించదని ఢిల్లీలోని ఎయిమ్స్ తాజాగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. పరిశోధనలో భాగంగా గత ఏడాది కాలంలో 100 మృతదేహాలకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వాటి ఫలితాల ఆధారంగా మృతదేహాల నుంచి కరోనా వ్యాపించదన్న నిర్ణయానికొచ్చారు. ఈ వివరాలను ఎయిమ్స్ ఫోరెన్సిక్ చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా తెలిపారు. ‘కరోనాతో చనిపోయిన వ్యక్తుల ముక్కులోగాని, నోటిలోగానీ వారు మరణించిన 12-24 గంటల తర్వాత వైరస్ క్రియాశీలంగా ఉండదు. కాబట్టి వారి నుంచి ఇతరులకు కరోనా సోకద’ని చెప్పారు. ‘సుమారు వంద మృతదేహాలకు వారు మరణించిన 12 నుంచి 24 గంటల వ్యవధిలో కరోనా పరీక్షలు నిర్వహించాం. పరీక్షల్లో ఆ మృతదేహాల్లో వైరస్ లేదని తేలింది. కరోనా రోగులు మరణించిన 24 గంటల తర్వాత వారి ముక్కు, నోట్లో ఆ వైరస్ ఉండదు’ అని గుప్తా వివరించారు. అయితే కొన్ని ముందు జాగ్రత్తలను తప్పక పాటించాలని సూచించారు. కరోనాతో మృతుల ముక్కు, నోటితో పాటు శరీరంపై ఎక్కడైనా గాయాలు ఉంటే ద్రవాలు స్రవించకుండా వాటిని మూసివేయాలని చెప్పారు. ఆ మృతదేహాలను తరలించేవారు, అంత్యక్రియలు నిర్వహించేవారు మాస్కులు, గ్లౌజులు, పీపీఈ కిట్లు వంటి రక్షణ కవచాలు ధరించాలని తెలిపారు.