న్యూఢిల్లీ, ఆగస్టు 10: దేశీ విమాన చార్జీలపై గతంలో విధించిన పరిమితుల్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. విమాన ప్రయాణాలకు రోజువారీ డిమాండ్, విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరల్ని సమీక్షించిన అనంతరం చార్జీలపై పరిమితుల్ని ఈ ఆగస్టు 31 నుంచి తొలగించాలని నిర్ణయించినట్టు బుధవారం కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ట్వీట్ చేశారు.
ఈ రంగం స్థిరపడిందని పేర్కొంటూ భవిష్యత్తులో వృద్ధిసాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రికార్డుస్థాయికి పెరిగిన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు కొద్ది వారాలుగా తగ్గుతున్నాయి. తాజాగా ప్రభుత్వం పరిమితుల్ని ఎత్తివేయడంతో చార్జీలను విమానయాన సంస్థలు స్వేచ్ఛగా పెంచుకోవొచ్చు. ఈ నేపథ్యంలో ఎయిర్లైన్ చార్జీలు క్రమేపీ పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
2020లో రెండు నెలల కొవిడ్ లాక్డౌన్ ముగిసిన తర్వాత అదే ఏడాది మే 25న దేశీ విమాన చార్జీలపై పరిమితుల్ని ప్రభుత్వం విధించింది. వివిధ నగరాల మధ్య విమానం ప్రయాణించే సమయం ఆధారంగా పరిమితుల్ని నిర్దేశించింది. ఉదాహరణకు 40 నిముషాల లోపు ప్రయాణాలకు విమానయాన సంస్థలు 2,900కు (జీఎస్టీని మినహాయించి) తక్కువ గానీ, 8,800కు (జీఎస్టీని మినహాయించి) మించిగానీ ప్రయాణీకుల నుంచి వసూలు చేయకూడదన్న పరిమితి ప్రస్తుతం ఉంది. దాదాపు 27 నెలల తర్వాత ఈ పరిమితులకు కేంద్రం స్వస్తిచెప్పింది.