న్యూఢిల్లీ, మే 25: కొవిడ్ రోగుల్లో మ్యూకోర్మైకోసిస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఫంగస్ కేసులపై పలువురు అంటువ్యాధుల నిపుణులు మంగళవారం ప్రత్యేక సూచనలు చేశారు. ‘మ్యూకోర్మైకోసిస్’ను వివిధ రంగుల పేర్లతో పిలుస్తూ ప్రజల్లో అనవసర భయాల్ని సృష్టించొద్దన్నారు. ఫంగస్ కేసులకు గల కారణాలు, పర్యవసనాలపై విశ్లేషించాల్సిన అవసరమున్నదన్నారు.
ఇమ్యూనిటీ ముఖ్యం
ఫంగస్లను బ్లాక్, వైట్, యెల్లో పేర్లతో పిలువడం మానేయాలి. ఇది ప్రజల్లో అనవసర భయాల్ని సృష్టిస్తుంది. రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ) క్షీణిస్తే, రోగుల్లో ఈ ఫంగస్లు ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటే ఎలాంటి ఫంగస్నైనా పారద్రోలవచ్చు.
-ఐసీఎంఆర్లోని అంటువ్యాధుల విభాగం హెడ్ డాక్టర్ సమీరన్ పాండా
చికిత్స కంటే నియంత్రణ ముఖ్యం
ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావడం సాధారణమే. వాటికి చికిత్స కూడా ఉంది. అయితే సెకండ్వేవ్లో ఈ వ్యాధులు రావడానికి గల కారణాలను గుర్తించాలి. కరోనా తొలిదశలో కనిపించని ఈ వ్యాధులు ఇప్పుడే ఎందుకు వ్యాపిస్తున్నాయో నిర్ధారించాలి. పారిశ్రామిక ఆక్సిజన్ వినియోగం, కొత్త వేరియెంట్లు దీనికి కారణం కావొచ్చు. ఫంగస్ చికిత్సపై పెడుతున్న శ్రద్ధ, వ్యాధి విజృంభణను నియంత్రించడంపై కేంద్రీకరించాలి.
-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లోని లైఫ్ కోర్స్ ఎపిడెమాలజీ విభాగం హెడ్ డాక్టర్ గిరిధర్ ఆర్ బాబు
ముందుగా గుర్తిస్తే, చికిత్స సులభం
యెల్లో ఫంగస్ సాధారణంగా బల్లిలాంటి సరీసృపాల్లో కనిపిస్తుంది. న్యాయవాది అయిన ఓ వ్యక్తి తీవ్రమైన జ్వరం, నీరసంతో నా దగ్గరకు వచ్చాడు. ఎండోస్కోపీ పరీక్షలో అతనికి యెల్లో ఫంగస్ సోకినట్టు గుర్తించా. అతనిలో బ్లాక్, వైట్ ఫంగస్ లక్షణాలు కూడా గుర్తించాం. కరోనా సోకి హోంఐసోలేషన్లో ఉన్న అతను పది రోజుల తర్వాత నా దగ్గరకు వచ్చాడు. అంతకు ముందే అతను వచ్చుంటే ఫంగస్ను నయం చేసేవాళ్లం. ఫంగస్ లక్షణాలు కనిపించిన మొదట్లోనే వైద్యసాయం తీసుకుంటే మేలు.
-డాక్టర్ బీపీ త్యాగి