NCERT | న్యూఢిల్లీ, జూన్ 9: చరిత్రను వక్రీకరిస్తూ పాఠ్య పుస్తకాల్లో భారీగా మార్పులు చేస్తున్న బీజేపీకి గట్టి షాక్ తగిలింది. చరిత్రను వక్రీకరించి రాసిన పొలిటికల్ సైన్స్ పుస్తకాల సలహాదారులుగా తమ పేర్లను తొలగించాలని 9-12 తరగతుల పొలిటికల్ సైన్స్ పుస్తకాలకు ముఖ్య సలహాదారులుగా వ్యవహరించిన సుహాస్ పాల్షికర్, యోగేంద్ర యాదవ్ ఎన్సీఈఆర్టీకి శుక్రవారం లేఖ రాశారు. 2006-07లో ముద్రితమైన ఒరిజినల్ పుస్తకాలకు వీరు ముఖ్య సలహాదారులుగా వ్యవహరించారు.
పొలిటికల్ సైన్స్ పుస్తకాల్లో అహేతుకమైన మార్పులు చేశారని… ఈ నేపథ్యంలో పుస్తక సలహాదారులుగా ఉండేందుకు ఇబ్బందిగా అనిపిస్తున్నదని వారు అందులో తెలిపారు. ‘ఈ సిలబస్లో బోధనాపరమైన హేతుబద్ధత కనిపించడం లేదు. సిలబస్లో ఏర్పడిన ఖాళీలను పూరించలేదు. అధికారంలో ఉన్నవారిని సంతృప్తిపరిచేందుకే ఈ మార్పులు చేసినట్టుగా అనిపిస్తుంది. ఎటువంటి లాజిక్ లేకుండా అనేకసార్లు సిలబస్లో అహేతుకమైన కోతలు, తొలగింపులు చేశారు. ఈ తొలగింపులు విద్యా స్ఫూర్తికి విఘాతం కలిగిస్తాయి. ప్రస్తుత సిలబస్ పొలిటికల్ సైన్స్పై అవగాహన కలిగించేలా విద్యార్థులకు శిక్షణను ఇవ్వలేదు. విద్యార్థులకు విద్యాపరంగా పనికిరాని పుస్తకాలకు సలహాదారులుగా ఉండాలంటే ఇబ్బందిగా ఉంది.’ అని వారు లేఖలో అభిప్రాయపడ్డారు. అన్ని తరగతుల డిజిటల్తో పాటు ముద్రితమయ్యే పుస్తకాల్లో నుంచి తమ పేర్లను తొలగించాలని వారు కోరారు.
తనకు సంబంధం లేని అన్ని అంశాల్లోనూ కమలం పార్టీ తలదూరుస్తున్నది. భారత దేశ చరిత్రలో తనకంటూ ఒక పేజీ లేకపోవడంతో సిలబస్ను మార్చేందుకు పూనుకున్నది. తమ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న అంశాలను తొలగిస్తున్నది. అదే సమయంలో తమ పార్టీ భావజాలం ఉన్నవారికి సంబంధించిన చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చేందుకు తహతహలాడుతున్నది.