న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: బలవంతపు వసూళ్లకు పాల్పడే పోలీసులను కచ్చితంగా జైలుకు పంపాల్సిందే అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. అలా దోచుకొన్నవారు ఏదో ఒక రోజు వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి వస్తుందన్నారు. ఐపీఎస్ అధికారి గుర్జీందర్ పాల్ సింగ్పై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆదాయానికి మించిన ఆస్తులు, బలవంతపు వసూళ్లు, రాజద్రోహం ఆరోపణలతో కేసు పెట్టింది. ఈ కేసులో అరెస్టు నుంచి రక్షించాలని గుర్జీందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం కోర్టులో విచారణ జరిగింది. ‘మీరు ప్రతీ కేసులో అరెస్టు నుంచి రక్షణ పొందలేరు. మీకు రక్షణ ఎందుకు కల్పించాలి? పనిచేసే చోట ప్రభుత్వాలతో సన్నిహితంగా ఉంటూ అధికారులు ఆస్తులు సంపాదిస్తున్నారు. దేశంలో ఇదో ట్రెండ్లాగా మారింది’ అని జస్టిస్ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ వేరే పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు పరిస్థితులు మారతాయని, అక్రమంగా సంపాదించినదంతా తిరిగి చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే, గుర్జీందర్ సింగ్కు సుప్రీంకోర్టు ఈ కేసులో కూడా రక్షణ కల్పించడం గమనార్హం. గుర్జీందర్ గతంలో కూడా ఇలాంటి రెండు కేసుల్లోనే సుప్రీంకోర్టును ఆశ్రయించి అరెస్టు నుంచి రక్షణ పొందారు. ఇదిలా ఉండగా, ఇదే సుప్రీంకోర్టు ఆగస్టులో ఓ కేసు విచారణ సందర్భంగా ‘ప్రభుత్వంలో పార్టీలు మారినప్పుడు అంతకు ముందు ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇదో ట్రెండ్లా మారింది. ఇది మంచిది కాదు’ అని వ్యాఖ్యానించింది.
నేరుగా బెంచ్ను అడగొద్దు
కార్పొరేట్ వ్యవహారాలపై అత్యవసర విచారణ చేపట్టాలంటూ న్యాయవాదులు తరచూ కోరుతుండటంపై జస్టిస్ ఎన్వీ రమణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆనవాయితీతో బలహీన వర్గాల కేసులు, ఇతర ముఖ్యమైన కేసుల విచారణ వెనుకబడిపోతున్నదని తెలిపారు. ఇకపై అత్యవసర విచారణ కోసం నేరుగా బెంచ్ను కోరడం కాకుండా, కోర్టు రిజిస్ట్రార్కు తెలియజేయాలని స్పష్టంచేశారు. రిజిస్ట్రార్ తిరస్కరిస్తే బెంచ్ ముందుకు రావచ్చన్నారు. సీనియర్ న్యాయవాదులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి జూనియర్ న్యాయవాదుల అవకాశాలను తోసిపుచ్చలేమన్నారు.
పాట్నా హైకోర్టుకు 8 మంది జడ్జిలు!
ఇద్దరు జ్యుడిషియల్ అధికారులకు, ఆరుగురు న్యాయవాదులకు పాట్నా హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి కల్పించాలన్న ప్రతిపాదనకు సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది. జస్టిస్ రమణ నేతృత్వంలోని కొలీజియం తీసుకున్న ఈ నిర్ణయం వివరాలను సోమవారం సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు.
సాయం… హక్కు కాదు
ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందడం విద్యాసంస్థల ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విద్యా సంస్థలకు ఆర్థిక సహాయంపై నిర్ణయానికి ముందు ప్రభుత్వం తన ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుందని పేర్కొంది. ఎయిడెడ్ సంస్థలైతే ఈ విషయంలో మైనారిటీ, మైనారిటీయేతర సంస్థలకు తేడా ఉండదని తెలిపింది. ఒకవేళ ఆర్థిక సహాయాన్ని ఉపసంహరించాలని ప్రభుత్వం నిర్ణయించినా విద్యాసంస్థలు తమ హక్కుగా ప్రశ్నించలేవని స్పష్టం చేసింది.
పిల్ వేసే అంశంపై పిటిషనర్కు అవగాహన తప్పనిసరి
ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు(పిల్) దాఖలు చేసేవారు తాము ఏ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకువస్తున్నారో దానిపై కనీస అవగాహన పెంచుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తాము వేసిన పిల్పై ఉదాహరణలు, సమాచారం తదితర వివరాలను కోర్టుకు తెలుపాల్సిన బాధ్యత పిటిషనర్పై ఉంటుందని స్పష్టం చేసింది. ఒకే పిల్లో భిన్న అంశాలపై ఆదేశాలు జారీచేయాలని కోరవద్దని సూచించింది. నేషనల్ హెల్త్ పాలసీ-2017ని అమలు చేసేలా, కొవిడ్తో చనిపోయినవారి కుటుంబాలకు జీవనోపాధి కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ఓ పిల్ను తిరస్కరించింది. సరైన సమాచారంతో మరో పిల్ దాఖలు చేయాలని సూచించింది.